పాక్ వైఖరిపై భారత్ ఘాటు స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎన్నికలు నిర్వహించబోతున్నామని పాకిస్తాన్ ప్రకటించడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. పాక్ ఆక్రమిత ప్రాంతమైన గిల్గిత్ బాల్టిస్తాన్లో ఎన్నికలు పెడతామంటూ పాకిస్తాన్ ప్రకటించింది. ఇక దీనిపై కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఘాటుగా స్పందించింది. ఈ చర్యలను భారత్ ఖండించింది.
ఇలా ఎన్నికలు నిర్వహించడం ద్వారా కేంద్రపాలిత భూభాగాలైన జమ్మూకశ్మీర్, లద్ధాఖ్లను పాకిస్తాన్ తన ఆధీనంలోకి తీసుకోలేదని పేర్కొంది. ఇది అక్కడ ఉన్న ప్రజల హక్కులను కాలరాయడమేనని, వారి స్వేచ్ఛను హరించడమే అని ధ్వజమెత్తింది. ఏడు దశాబ్ధాల నుంచి అక్కడ ప్రజలు నివసిస్తున్నారని తెలిపింది. ఈ చర్యలు చూస్తుంటే తన ఆక్రమణను కప్పిపుచ్చుకోవడానికి అందమైన అలంకరణ చేసినట్లుగా ఉందని భారత విదేశాంగశాఖ పేర్కొంది.