
కబుర్లతో కాలక్షేపం.. కొసరికొసరి వడ్డనలు
ఈ ‘రౌండ్ టేబుల్’తో ఇంటిల్లిపాదికీ ఆరోగ్యం
మంచి మాటలతో అందరి మనసులకూ ఆహ్లాదం
మంచి ఔషధమంటున్న మానసిక, వైద్య నిపుణులు
‘కలిసి తినే కుటుంబం కలిసి ఉంటుంది’ అని సామెత. కుటుంబ సభ్యులంతా కలిసి కూర్చొని, భోజనం చేస్తే మనసుకు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుందని పూర్వీకులు తమ అనుభవంతో ఏర్పరచిన ఈ సంప్రదాయాన్ని ఇప్పుడు వైద్య పరిశోధకులు సైతం ధ్రువీకరిస్తున్నారు. ‘కలిసి ఉంటే కలదు సుఖం – కలసి తింటే కలదు ఆరోగ్యం’ అని నిర్ధారణగా చెబుతున్నారు. చక్కటి భోజన సంభాషణ మనిషిలోని నిస్సత్తువను పోగొడుతుందని, మానసిక ఒత్తిళ్ల నుంచి ఉపశమనం లభిస్తుందని, కుటుంబ సభ్యుల మధ్య బంధాలు మరింత బలపడతాయని మానసిక, వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
ఆస్వాదనతో పాటు అనుభూతీ!
కుటుంబ సభ్యులను అత్మీయతలతో పెనవేసే అనేక అంశాలలో ‘అందరూ కలిసి భోజనం చేయటం’ అనే అలవాటు ముఖ్యమైనది. భోజనాన్ని ఆస్వాదిస్తూనే, సంభాషణలను అనుభూతి చెందే అవకాశం డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. కుటుంబానికి ఇంతకంటే ముఖ్యమైన ‘రౌండ్ టేబుల్ సమావేశం’ మరొకటి ఉండదు. ఉల్లాసకరమైన మాటలు వస్తాయి. ఉత్తేజకరమైన నవ్వులు పూస్తాయి. ఆహ్లాదం ఘుమఘుమలాడుతుంది. సందట్లో ఓ నాలుగు ముద్దలు ఎక్కువ తింటాం. అందుకే భోజన సంభాషణ అంటే కేవలం ఒక మంచి విషయం మాత్రమే కాదు, మానసికమైన ఆరోగ్యం కూడా అంటున్నారు మనోవైజ్ఞానిక నిపుణులు. – సాక్షి, స్పెషల్ డెస్క్
జెన్–జి తరానికి తప్పనిసరి
భోజన సంభాషణలు కేవలం ఆచారాలు కావు. ఇవి రోజువారీ నిస్సత్తువను పోగొట్టి, మానసిక ఆరోగ్యాన్నిచ్చే సందర్భాలు కూడా. భారతీయ సంస్కృతిలో అంతర్లీనమైనదిగా ఉన్న ప్రియ భోజన భాషణ ఇప్పటి జెన్–జి తరానికి తప్పనిసరి అవసరం అని అధ్యయనాలు చెబుతున్నాయి. భోజనం చేసే సమయంలోని మనోల్లాసమైన సంభాషణలు మెదడును నెమ్మదింపజేస్తాయి. నాడీ వ్యవస్థను నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించడంలో తోడ్పడతాయి. అయితే ఆధునిక జీవన శైలిలోని ఉరుకులు పరుగుల వల్ల వ్యక్తిగత జీవితంలోకి వృత్తిపరమైన బాధ్యతలు చొరబడి, ఇంటిల్లపాదీ కలిసి కూర్చొని భోజనం చేసే సంప్రదాయం నెమ్మదిగా అంతరించిపోతోంది.
ఆసక్తి ఉన్నా అవకాశం లేదు
ఈ తరం పిల్లలు భోజనానికి కలవరు. ఇంటి సంభాషణలపై ఆసక్తి చూపరు. అలాగని కుటుంబ సంబంధాలు, కుటుంబ భోజనాలపై వారు మరీ అంత నిర్లిప్తంగా కూడా ఏమీ లేరు. 1996 తర్వాత జన్మించిన 2,000 మందిపై జరిగిన ఒక అధ్యయనం ప్రకారం 64 శాతం మంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో భోజన సంభాషణలను జరపటంలో ఆసక్తి చూపారు. అదే సమయంలో.. అందుకు అవకాశం ఉండటం లేదని అన్నారు. ఎవరికి వారుగా భోజనం ముగించే వ్యక్తిగత వ్యవహారంగా మారిన ప్రస్తుత తరుణంలో.. కుటుంబ బంధాలు మెరుగవ్వాలంటే కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకొంటూ భోజనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
భోజన సమయ బంధుత్వాలు..: చిన్న కుటుంబాల్లో పెద్దవాళ్లకు చోటు ఉండదు. కానీ భోజన సమయంలో పెద్దవాళ్ల గురించిన కథలకు చోటు లేకుండా ఉండదు. తరాల కథలు మాటల్లోకి వస్తాయి. పారంపర్య కుటుంబ గాథలు ఇష్టమైన భోజనంలా అనిపిస్తాయి. ‘మరి కాస్త వడ్డించు’ అని అడిగినట్లుగా వంశవృక్షంలోని తాత ముత్తాల గురించి ‘ఇంకా చెప్పు’ అని కుతూహలంగా అడిగి మరీ చెప్పించుకుంటారు. ఎంతో ముఖ్యమైన రేపటి ఆ ‘ముఖ్యమైన సమావేశం’ గురించిన ఆలోచన మదిలోకే రాదు. అంతా కలిసి భోంచేస్తున్నారు కదా పాపం.. అని డెడ్లైన్లు డైనింగ్ హాల్ బయటే ఉండిపోతాయి. ఇక భోజన సమయంలో ‘నో–ఫోన్ పాలసీ’ పెట్టుకుంటే కడుపు నిండా కబుర్లు.. కళ్ల నిండా కమ్ముకునే నిద్ర మేఘాలు.
‘బర్నౌట్కు’ తగిన చికిత్స..: ఒత్తిడి, అలసట. శక్తి క్షీణత.. అన్నీ కలిసి ప్రపంచాన్ని ఇప్పుడు ‘బర్నౌట్’ చేసేస్తున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ బర్నౌట్ను ‘పని ఒత్తిడి సిండ్రోమ్’గా వర్ణించింది. ప్రస్తుతం ఈ డిజిటల్ ప్రపంచంలో బర్నౌట్ కాని వారు లేరంటే అతిశయోక్తి కాదు. 2024 సెప్టెంబర్లో భారత వాణిజ్య, పరిశ్రమల సమాఖ్య (ఫిక్కీ), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ సంయుక్తంగా నిర్వహించిన ఓ అధ్యయనం.. 58 శాతం మంది భారతీయులు పనిలో అమితంగా బర్నౌట్ అవుతున్నట్లు వెల్లడించింది.
ఈ బర్నౌట్ నుంచి బయటపడేందుకు కుటుంబంతో కలిసి భోజనం చేయటం ఒక మంచి మార్గమని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా, సానుకూల భోజన సంభాషణలు.. ఒత్తిడికి మూలమైన ‘కార్టిసాల్’ అనే హార్మోన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడే ‘ఆక్సిటోసిన్’ హార్మోన్ను విడుదల చేస్తాయి. ఆక్సిటోసిన్ సామాజిక బంధాలకు, సంతానోత్పత్తికి దోహదపడుతుంది. లైంగిక సామర్థ్యం పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. దీని వల్ల మెదడుకు విశ్రాంతి లభిస్తుంది.
మాటలు ప్లేట్లు దాటకూడదు!..: భోజన సంభాషణలు తేలికగా ఉన్నప్పుడే కలిసి భోజనం చేయటం వల్ల ప్రయోజనాలు చేకూరుతాయి. లేదంటే, ఒంటరిగా తినడమే నయం అనే నిస్పృహలోకి వెళ్లిపోతారు. పచ్చళ్ల దగ్గర మొదలై పంతాలూ పట్టింపుల వరకు వెళ్లిపోతే.. కలిసి భోజనం చేయకపోతేనే ఉత్తమం. చాలా వరకు సంభాషణ ఆహార పదార్థాల చుట్టూరానే తిరగాలి. మాటల్లోనే మాధుర్యం ఒలకాలి. ఇంట్లో ఎవరు ఏది ఇష్టంగా తింటారో సరదాగా చర్చించుకోవాలి.
రుచికరమైన వంటకాలు చేసిన వారిని ప్రశంసించడం.. ఈ చర్చా కార్యక్రమాన్ని రక్తికట్టించే అసలైన ప్రధాన ముడిసరుకు. అది మన అభిరుచిని తెలియజేయడమే కాదు.. మనకు ప్రేమగా వండిపెట్టిన వారి నైపుణ్యానికి కూడా దక్కాల్సిన కితాబు. వంటంతా ఒక ఎత్తయితే.. వడ్డన మరో ఎత్తు. ప్రేమగా, కొసరి కొసరి వడ్డిస్తుంటే.. ఎవ్వరూ నో చెప్పలేరు. అందుకే, అలా ప్రేమగా వడ్డించినవారిని కూడా మనస్ఫూర్తిగా మెచ్చుకోవాలి. కిందటి రోజు చూసిన సినిమా, ఆవకాయ పచ్చళ్లపై చర్చ, వంశపారంపర్య విశేషాల ప్రస్తావన.. కాదేదీ ప్రస్తావనకు అనర్హం. ఇలాంటి మంచి విషయాల చుట్టూ మాటలు సాగితే మనసుకు, దేహానికి మంచి మెడిసిన్ పడినట్లే.