సాక్షి, చెన్నై: ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి ఒక యువతిపై తమిళగ వెట్రి కళగం పార్టీకి చెందిన ఇద్దరు స్థానిక నేతలు సామూహిక లైంగిక ఒడిగట్టిన ఉదంతం తమిళనాడు రాజకీయాల్లో పెను దుమారం రేపుతోంది. శాంతిభద్రతల వైఫల్యంపై , మహిళల భద్రతపై ప్రస్తుత సీఎం విజయ్ లక్ష్యంగా డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు.
వివరాలు.. తూత్తుక్కుడి జిల్లా శ్రీవైకుంఠం సమీపంలోని ఆరుముగమంగళం ప్రాంతానికి చెందిన టీవీకే తూత్తుకుడి పశ్చిమ జిల్లా యువజన విభాగం నిర్వాహకుడు బాలమురుగన్, రామనాథపురం ప్రాంతానికి చెందిన టీవీకే ప్రతినిధి జయపాల్ ఇద్దరూ కలిసి.. శ్రీవైకుంఠం పరిధిలోని ఒక యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. అనంతరం ఆమెను మోసగించి, సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం మంగళవారం వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది.
దుమ్మెత్తి పోసిన ప్రతి పక్షాలు
ఈ ఘటనను అస్త్రంగాచేసుకుని సీఎం విజయ్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డాయి. డీఎంకే మాజీ మంత్రి గీతా జీవన్, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళణి స్వామి, బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, మాజీ అధ్యక్షుడు అన్నామలైలు వేర్వేరుగా స్పందిస్తూ, శ్రీవైకుంఠం వద్ద యువతిపై టీవీకే నేతలు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం రాష్ట్రంలో శాంతి భద్రతలను ప్రశ్నార్థకం చేస్తోందని మండిపడ్డారు. ఈ అఘాయిత్యాలకు టీవీకే శ్రేణులే పాల్పడుతుండటం బట్టి చూస్తే రాష్ట్రంలో ప్రజల రక్షణను ప్రశ్నార్థకంగా మారిందన్నారు.
సీఎం విజయ్ కేవలం పేజీల కొద్ది డైలాగులతో వ్యాఖ్యల తూటాలను పేల్చుతున్నారేగానీ, ఆచరణలో విఫలమయ్యారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో మహిళల రక్షణ గురించి గొప్పగా మాట్లాడిన విజయ్.. ఇప్పుడు తన పార్టీ నేతలే ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడటంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఇదేనా తమరి మార్పు అని నిలదీశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


