మొదటి అంతరిక్ష యాత్రికుడు హనుమాన్‌! | former Union Minister Anurag Thakur Calls Lord Hanuman The First Astronaut in School Event | Sakshi
Sakshi News home page

మొదటి అంతరిక్ష యాత్రికుడు హనుమాన్‌!

Aug 26 2025 4:59 AM | Updated on Aug 26 2025 4:59 AM

former Union Minister Anurag Thakur Calls Lord Hanuman The First Astronaut in School Event

పాఠశాల పిల్లలకు బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ కొత్త పాఠాలు

విద్యా వ్యవస్థలో శాస్త్రీయతపై విద్యావేత్తల ఆందోళన 

ఉనా (హిమాచల్‌): మొదటి అంతరిక్ష యాత్రికుడు ఎవరు? యూరీ గగారిన్‌.. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. కానీ.. హిమాచల్‌ ప్రదేశ్‌లో పిల్లలు చెప్పిన సమాధానం.. అందుకు మన కేంద్ర మాజీ మంత్రి ఇచ్చిన వివరణ.. మన దేశ విద్యా వ్యవస్థ దుస్థితి ఏంటో తెలియజెప్తోంది. ఇటీవల బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌.. హిమాచల్‌ ప్రదేశ్‌లోని ఓ పాఠశాలకు వెళ్లారు. అక్కడ ఆయన విద్యార్థులను ‘అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి వ్యక్తి ఎవరు?’ప్రశ్నించారు. దానికి పిల్లలంతా ముక్త కంఠంతో ‘నీల్‌ ఆర్మ్‌్రస్టాంగ్‌’అని చెప్పారు.

 అందుకు ఎంపీ.. ‘కాదు.. నేను హనుమాన్‌ అనుకుంటున్నాను. వేల సంవత్సరాల నాటి మన సంప్రదాయం, జ్ఞానం, సంస్కృతి ముఖ్యమైనవని ఇది చూపిస్తుంది. మనం మన స్వంతం గురించి నేర్చుకోకపోతే, బ్రిటిష్‌ వారు మనకు నేర్పించిన దానికే మనం పరిమితం అవుతాం’అని బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఎక్స్‌లో వైరల్‌ అవుతోంది. ఆ రెండు సమాధానాలు తప్పు. ‘నీల్‌ ఆర్మ్‌ స్ట్రాంగ్‌ కాదు.. యూరీ గగారిన్‌’అని చెప్పాల్సిన ఒక పార్లమెంటేరియన్‌.. జాతీయ అంతరిక్ష దినోత్సవం నాడు పిల్లల తప్పును సరిదిద్దకపోగా.. పురాణాలను చరిత్రగా చెప్పడం వివాదాస్పదమైంది. 

చర్రిత తప్పుదోవ..  
అంతరిక్షంలోకి ప్రయాణించిన మొదటి మానవుడు సోవియట్‌ వ్యోమగామి యూరి గగారిన్‌. అతను 1961లో ఆయన భూమిని చుట్టి వచ్చారు. ఆ తరువాత 1969లో అమెరికాకు చెందిన నీల్‌ ఆర్మ్‌్రస్టాంగ్‌ చంద్రునిపై నడిచిన మొదటి మానవుడిగా చరిత్ర సృష్టించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 51ఏ (హెచ్‌) శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సహించాలని చెబుతోంది. ఇప్పుడు ఆ చర్చ పక్కకు పోవడంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ‘పిల్లల మనసులను వలస ఆలోచనల నుంచి విముక్తి చేసి.. స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించాలన్న ప్రధాని పిలుపు మేరకే ఠాకూర్‌ అలా మాట్లాడి ఉండవచ్చు. కానీ.. సొంత సంస్కృతి గురించి గొప్పగా చెప్పుకోవడమంటే... సైన్స్, చరిత్ర పేరుతో పురాణాలను వల్లించడం కాదనే విషయాన్ని మరిచారు. మన చరిత్ర, సంస్కృతిని విద్యార్థులకు చెప్పాలనుకున్నప్పటికీ.. వాస్తవాలు, కల్పనల మధ్య తేడాను గుర్తించడం వారికి నేర్పించాలి. పురాణాలను పురాణాలుగానే చెప్తే తప్పు లేదు. కానీ.. పురాణాలను చరిత్రగా చెప్పడం కొత్త తరాన్ని తప్పుదోవ పట్టించడమే’అంటున్నారు.  

శాస్త్రీయ రుజువులు లేని పురాణాలు.. 
చరిత్ర వేరు.. పురాణాలు వేరు. రామాయణం, మహాభారతం వంటివి పురాణ కథలు. ఇవి నమ్మకం మీద నడిచేవి. కవి హోమర్‌ వర్ణనలను పోలిన నగరం 19వ శతాబ్దపు త్రవ్వకాల్లో బయటపడే వరకు ట్రాయ్‌ కూడా కల్పితంగానే పరిగణించారు. మన దేశంలో చాలా కథలకు భౌతిక ఆధారాలు లేవు. గుజరాత్‌ తీరంలో మునిగిపోయిన పురాతన నిర్మాణాలను పురావస్తు శాస్త్రవేత్తలు, శాస్త్రవేత్తలు మహాభారతంలోని ద్వారక నగరానికి లింక్‌ చేశారు. దానిపై ఇంకా చర్చ కొనసాగుతోంది. శాస్త్రీయ రుజువు లేకుండా, ఈ కథలు శక్తివంతమైన సాంస్కృతిక కథనాలుగా మిగిలిపోతాయే తప్ప, చరిత్రగా కాదు. గట్టి రుజువుతో నిరూపించబడే వరకు, యూరి గగారిన్‌ అంతరిక్షంలో మొదటి వ్యక్తిగా స్థిరపడతాడు. పిల్లలకు ఈ తేడాను నేర్పించాలి మరియు పార్లమెంటు సభ్యులు విద్య నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement