మనోహర్‌ జోషి పరిస్థితి ఆందోళనకరం

Former Maharashtra CM Manohar Joshi condition continues to be serious - Sakshi

ముంబై: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, లోక్‌సభ మాజీ స్పీకర్‌ మనోహర్‌ జోషి ఆరోగ్య స్థితి ఆందోళనకరంగా మారింది. శివసేన సీనియర్‌ నేత అయిన జోషిని మెదడులో రక్తస్రావంతో రెండు రోజుల క్రితం హుటాహుటిన ముంబైలోని పీడీ హిందూజా ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన స్పృహలోలేరని, దాదాపు కోమాలో ఉన్నారని ఆయన కుమారుడు ఉన్మేశ్‌ సోమవారం చెప్పారు. ‘ 85 ఏళ్ల జోషి ఐసీయూలో ఉన్నా వెంటిలేటర్‌ సాయంలేకుండా సాధారణ శ్వాస తీసుకుంటున్నారు.

ప్రస్తుత రక్తస్రావం పరిస్థితి అదుపులో ఉంది’ అని ఆస్పత్రి ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, శివసేన(యూబీటీ) చీఫ్‌ ఉద్దేశ్‌ ఠాక్రే, ఆయన భార్య రష్మీ ఆస్పత్రికి వచ్చి ఆయన ఆరోగ్య పరిస్థితిపై అడిగి తెల్సుకున్నారు. 1995లో బీజేపీతో పార్టీ సంకీర్ణం అయ్యాక మహారాష్ట్రలో శివసేన నుంచి తొలిసారిగా ముఖ్యమంత్రి పదవి పొందిన వ్యక్తి జోషియే. 1966లో శివసేన స్థాపించాక అప్పటినుంచీ జోషి అందులో సభ్యునిగా కొనసాగుతున్నారు. లోక్‌సభకు గతంలో స్పీకర్‌గా వ్యవహరించారు. ముంబై మేయర్‌గా సేవలందించారు. మహారాష్ట్ర శాసనసభలో విపక్షనేతగా కొనసాగారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీ హయాంలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top