ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి వేగవంతం | Sakshi
Sakshi News home page

ఆర్థిక క్రమశిక్షణతోనే అభివృద్ధి వేగవంతం

Published Mon, Oct 10 2022 4:33 AM

Financial discipline of northeast states is essential for Indian economy - Sakshi

గువాహటి నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ ఎదగాలంటే ఈశాన్య రాష్ట్రాల ఆర్థిక క్రమశిక్షణ అత్యవసరమని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యానించారు. గువాహటిలో ఈశాన్య రాష్ట్రాల మండలి(ఎన్‌ఈసీ) 70వ ప్లీనరీ ముగింపు సమావేశంలో అమిత్‌ పాల్గొని ప్రసంగించారు. అవసరమైన చోట నిధుల సద్వినియోగం, మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిపెడితే అభివృద్ధి ఫలాలు త్వరగా చేతికొస్తాయన్నారు.

కేంద్రనిధులతో పాటు రాష్ట్రాల ఆదాయాల విషయంలోనూ ఇదే విధానం అవసరమన్నారు. ‘ఇతర రాష్ట్రాలతో సమానంగా ఈశాన్య రాష్ట్రాలకు అభివృద్ధి చెందేందుకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇందుకోసం ఈశాన్య రాష్ట్రాలన్నీ సంపూర్ణ సమన్వయంతో పనిచేయాలి’ అని ఎన్‌ఈసీ చైర్మన్‌ హోదాలో అమిత్‌ సూచించారు. అమిత్, కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి, 8 రాష్ట్రాల సీఎంలు పాల్గొని ఈశాన్య రాష్ట్రాల భవిష్యత్‌ కార్యాచరణ, సమస్యల పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు.   

ఆరోగ్యకర పోటీ అవసరం : కిషన్‌రెడ్డి
కేంద్రం ఇస్తున్న 10 శాతం నిధుల సద్వినియోగం విషయంలో ఈశాన్య రాష్ట్రాల మధ్య ఆరోగ్యకర పోటీతోపాటు ప్రత్యేక దృష్టిసారిస్తే çపురోగతి సాధ్యమని కేంద్ర ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని 4,700 గ్రామాల్లో టెలికమ్యూనికేషన్‌ అనుసంధానత కోసం 500 రోజుల్లో లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు.
 

Advertisement
Advertisement