కర్ణాటక: అక్రమ సంబంధాన్ని కొనసాగించడానికి నిరాకరించిన కోడలిని హత్య చేసిన మామకు మైసూరు ఐదవ అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.వివరాలు..దోషి గంటయ్య కుమారుడు చిక్కలూరియాకు కవిత అనే యువతితో వివాహమైంది. ఆమె ఒక ప్రైవేట్ కళాశాలలో స్టోర్ కీపర్గా పనిచేసేది. మామ గంటయ్య ఆమెతో అక్రమ సంబంధం కలిగి ఉంది. ఆ సంబంధం కొనసాగించేందుకు కవిత అంగీకరించలేదు.
అయితే కవిత మహేష్ అనే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని గంటయ్య అనుమానించాడు. 2023 జూలై 10న తెల్లవారుజామున కవిత నిద్రలో ఉండగా గంటయ్య సుత్తితో తలపై, నుదుటిపై బాది హత్య చేశాడు. పోలీసులు గంటయ్యపై కేసు నమోదు చేసి, కోర్టుకు ఛార్జిషీట్ సమర్పించారు. నేరం నిరూపణ కావడంతో గంటయ్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ. 1.5 లక్షల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి కె. ఎన్.రూపా తీర్పు వెలువరించారు. తప్పుడు సాక్ష్యం ఇచ్చిన ప్రభుత్వ అధికారి మైఖేల్ మాథ్యూపై శాఖాపరమైన విచారణకు న్యాయమూర్తి ఆదేశించారు. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు బి. ఇ. యోగేశ్వర్, ఏ.ఎన్. మధు వాదించారు.


