ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మరోసారి తుపాకీ గర్జించింది. పోలీసులు - మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సల్స్ మృతి చెందారు. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు ప్రాణాలు కోల్పోగా.. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో పెద్దఎత్తున రైఫిల్స్ను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
ప్రస్తుతం మావోయిస్టు పార్టీ తీవ్ర గడ్డు పరిస్థులను ఎదుర్కొంటుంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా 2026 మార్చి కల్లా భారత దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తానని ప్రకటించడంతో కేంద్ర సాయుధ బలగాలు ఛత్తీస్గఢ్ అడవులను జల్లెడ పడుతున్నాయి. ఆపరేషన్ కగార్, ఆపరేషన్ కర్రెగుట్ట చేపట్టి పెద్దఎత్తున నక్సల్స్ ని మట్టుబెట్టాయి. దీంతో కొంతమంది పార్టీ అగ్రనేతలు లొంగిపోయి మిగిలిన వారిని జన జీవన స్రవంతిలోకి రావాలని కోరుతున్నారు.
ఇటీవలే మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, గెరిల్లా దాడుల వ్యూహకర్త మడ్వి హిడ్మా సైతం అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్ కౌంటర్ లో మృతి చెందారు. హిడ్మా మృతితో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో ఆయనతో పాటు ఆరుగురు మావోయిస్టులు ఎన్ కౌంటర్ లో ప్రాణాలు వదిలారు. హిడ్మా మృతి పట్ల కేంద్రం హోం మంత్రి స్పందిస్తూ మావోయిస్టులపై పోలీసులు సాధించిన కీలక విజయం అని వ్యాఖ్యానించారంటే ఆయన ప్రాధాన్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు.
కాగా ప్రస్తుతం మావోయిస్టు పార్టీలో ఉన్న కీలక నేతలు లొంగిపోడమో లేదా ఎన్ కౌంటర్ లలో మరణించడమో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ భవితత్వంపై నీలినీడలు కమ్ముకున్నాయి.



