మిత్ర పక్షాలతో భేటీ.. స్టాలిన్‌ కీలక నిర్ణయం | Dmk Chief Mk Stalin Meets Allies Leaders | Sakshi
Sakshi News home page

మిత్ర పక్షాలతో భేటీ.. స్టాలిన్‌ కీలక నిర్ణయం

May 7 2026 3:07 PM | Updated on May 7 2026 3:30 PM

Dmk Chief Mk Stalin Meets Allies Leaders

చెన్నై: డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. మిత్ర పక్షాలతో డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ భేటీ అయ్యారు. సీపీఐ, సీపీఎం, వీసీకే నేతలతో సమావేశమైన స్టాలిన్‌.. టీవీకేకు మద్దతు అంశాన్ని  మిత్రపక్షాలకే వదిలేశారు. స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోమని మిత్రపక్షాలకు సూచించారు. కాగా, వామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన టీవీకే అధినేత విజయ్‌.. లేఖ రాసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో స్టాలిన్‌తో  మిత్రపక్షాల నేతలు భేటీ అయ్యారు. విడిగా పార్టీ సమావేశాలు కూడా నిర్వహించుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. అయితే, తమ నిర్ణయం ఏంటన్నది ఈ భేటీల తర్వాత ప్రకటించే చాన్స్‌ ఉందని తెలుస్తోంది. లోక్‌ భవన్‌లో గవర్నర్‌తో అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి కూడా భేటీ కానున్నారు.

ఇదిలా ఉండగా.. గవర్నర్‌, విజయ్‌ భేటీపై లోక్‌భవన్‌ వివరణ ఇచ్చింది. మెజార్టీపై టీవీకే పూర్తి వివరాలు ఇవ్వలేదని.. సంఖ్యాబలం  చూపించాలని విజయ్‌ను కోరామని లోక్‌ భవన్‌ తెలిపింది. మరో వైపు, లోక్‌సభ ఎదుట విజయ్‌ అభిమానుల ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

విజయ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ.. ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు. మద్దతు ఇవ్వమని ఇదివరకే వీసీకే ప్రకటించింది. కాగా, విజయ్‌ లేఖ నేపథ్యంలో వీసీకే పునరాలోచనలో పడినట్లు సమాచారం. ఇండియన్‌ యూనియన్‌ ముస్లిం లీగ్‌ మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

 

 

Advertisement
 
Advertisement
Advertisement