Delhi Mayor Election Postponed For Third Time - Sakshi
Sakshi News home page

మేయర్‌ ఎన్నిక: ఢిల్లీ చరిత్రలోనే తొలిసారి.. ఆప్‌కు ముచ్చటగా మూడోసా‘రీ’!

Feb 6 2023 1:20 PM | Updated on Feb 6 2023 2:41 PM

Delhi Mayor Election Postponed Third Time - Sakshi

గెలిచిన సంబురం ఆప్‌కు లేకుండా పోతోంది. ఢిల్లీ మున్సిపల్‌ ఎన్నికల్లో.. 

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మేయర్‌ ఎన్నికకు సంబంధించి ఆమ్‌ ఆద్మీ పార్టీకి భంగపాటు తప్పడం లేదు. ఎన్నికల్లో గెలిచినా మేయర్‌ పదవి ఊరిస్తూనే వస్తోంది. తాజాగా.. మేయర్‌ ఎన్నిక జరగకుండానే ఎంసీడీ హౌజ్‌ను సోమవారం వాయిదా వేస్తునట్లు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ(బీజేపీ) ప్రకటించారు . దీంతో  ముచ్చటగా మూడోసారి ఎన్నిక వాయిదా పడినట్లయ్యింది. 

ఢిల్లీ చరిత్రలోనే మేయర్‌ ఎన్నిక ఆలస్యం కావడం ఇదే తొలిసారి. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌(డీఎంసీ) యాక్ట్‌ 1957 ప్రకారం.. మేయర్‌, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక.. ఫలితాలు వెలువడిన నెలలోపే అదీ తొలి సెషన్‌లోనే జరిగిపోవాలి. అది జరుగుతూ వస్తోంది కూడా. కానీ, ఈసారి ఆ ఆనవాయితీకి బ్రేక్‌ పడినట్లయ్యింది. ఫలితాలు వెలువడి రెండు నెలలు గడుస్తున్నా ఇంకా మేయర్‌ ఎన్నికపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. 

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ వీకే సక్సేనా నామినేట్‌ చేసిన పది మంది కౌన్సిలర్లను.. మేయర్‌ ఓటింగ్‌కు ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ అనుమతించారు. దీంతో సోమవారం హౌజ్‌ ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం చెలరేగింది. ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ యాక్ట్‌ ప్రకారం.. నామినేట్‌ సభ్యులుగానీ, పెద్దల కోటాలో ఎన్నికైన సభ్యులు గానీ మేయర్‌ ఎన్నికలో ఓటేయడానికి వీల్లేదు. 

కానీ, ప్రిసైడింగ్‌ ఆఫీసర్‌ సత్య శర్మ మాత్రం ఎల్జీ నామినేట్‌ చేసిన పది మందిని ఓటింగ్‌కు అనుమతించడం ద్వారా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ఆప్‌ సభ్యులు మండిపడ్డారు. ఈ తరుణంలో ఆప్‌, బీజేపీ సభ్యుల మధ్య తోపులాట, పోటాపోటీ నినాదాలతో వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభను వాయిదా(తదుపరి తేదీ చెప్పకుండానే) వేస్తున్నట్లు సత్య శర్మ ప్రకటించారు.

ఇదిలా ఉండగా.. జనవరి 6, జనవరి 24వ తేదీల్లో సభ్యుల ఆందోళన వల్ల నెలకొన్న గందరగోళం నేపథ్యంలో రెండుసార్లు మేయర్‌ ఎన్నిక వాయిదా పడింది. ఇవాళ మూడోసారి కూడా వాయిదా పడింది. పదిహేనేళ్ల తర్వాత బీజేపీ ఢిల్లీ మేయర్‌ ఎన్నికల్లో ఓడిపోగా.. విజయం సాధించిన ఆప్‌ మేయర్‌, డిప్యూటీ మేయర్‌ పదవులపై గంపెడాశలు పెట్టుకుంది.

ఢిల్లీ మేయర్‌ను ఎన్నికల్లో నెగ్గిన మున్సిపల్‌ కౌన్సిలర్లు, ఢిల్లీ పరిధిలోని ఏడుగురు లోక్‌సభ ఎంపీలు, ముగ్గురు రాజ్యసభ ఎంపీలు, వీళ్లతో పాటు ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ నామినేట్‌ చేసే 14 మంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. తొలి దఫాలో.. ఏ పార్టీ అయినా సరే మహిళా అభ్యర్థికే ఢిల్లీకి మేయర్‌ పీఠం కట్టబెడుతారు.ఢిల్లీ మేయర్‌ పదవి.. ఐదేళ్లలో ఏడాది చొప్పున మారుతుంటుంది. మొదటి ఏడాది మహిళలకు రిజర్వ్‌ చేశారు. రెండో ఏడాది ఓపెన్‌ కేటగిరీ కింద అభ్యర్థిని ఎంపిక చేస్తారు. మూడో ఏడాదిలో రిజర్వ్డ్‌ కేటగిరీ కింద, ఆ తర్వాత రెండేళ్లకు ఓపెన్‌ కేటగిరీ కింద మేయర్‌ అభ్యర్థిని ఎన్నుకుంటారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement