=డెత్నోట్లో మృతుడు రవీంద్ర
కర్ణాటక: ఓ వ్యక్తి డీఎస్పీ, ఎస్ఐల పేర్లు డెత్నోట్లో రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెళగావి జిల్లా గోకాక్ తాలూకా బెండిగేరి గ్రామంలో చోటు చేసుకుంది. ఆ గ్రామానికి చెందిన రవీంద్ర ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇచ్చిన అప్పులు తిరిగి ఇవ్వలేదని మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇచ్చిన అప్పులను తిరిగి ఇవ్వమన్నందుకు ప్రాణాలు తీస్తామని బెదిరించారన్న భయంతో ఆత్మహత్య చేసుకున్నట్లు రవీంద్ర డెత్ నోట్లో పేర్కొన్నాడు. అంతేగాక పోలీసులు కూడా తన పట్ల అన్యాయంగా నడుచుకున్నారని ఆయన పేర్కొనడంతో కేసు కలకలం సృష్టిస్తోంది.
లక్ష్మణ చందరిగి, భరమప్ప పూజారిలకు రూ.8 లక్షలు అప్పు ఇచ్చాను. అయితే ఆ డబ్బును లక్ష్మణ్, భరమప్ప తిరిగి ఇవ్వలేదు. డబ్బులు ఇవ్వమని అడిగితే చంపుతామని బెదిరించారు. ఈ విషయంలో తనకు న్యాయం చేయాలని ఎస్ఐ ఆనంద్, డీఎస్పీకి విజ్ఞప్తి చేసినా కూడా వారు స్పందించలేదని, వారు కూడా వారిలానే తనను చంపుతామని బెదిరించారని రవీంద్ర ఆత్మహత్యకు ముందు రాసిన డెత్నోట్లో వివరించారు. ఘటనా స్థలాన్ని మూడలిగి పోలీసులు పరిశీలించారు. రవీంద్ర భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు 8 మందిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


