Coronavirus Positive Cases In Bangalore Last 24 Hours, Covid Second Wave In Bangalore - Sakshi
Sakshi News home page

బెంగళూరులో వైరస్‌ బీభత్సం.. ఒకేరోజు 10 వేల కేసులు

Apr 16 2021 8:20 AM | Updated on Apr 16 2021 9:29 AM

Covid 19 Second Wave Bangalore Records 10497 New Cases - Sakshi

బెంగళూరులో తాజాగా 10,497 మంది కోవిడ్‌ బారినపడ్డారు. 1,807 డిశ్చార్జిలు, 30 మరణాలు నమోదయ్యాయి.  

సాక్షి, బెంగళూరు: మహమ్మారి కరోనా రెండో ఉధృతి కర్ణాటకలో కల్లోలం సృష్టిస్తోంది. గతేడాది లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత విజృంభించిన రీతిలో ఇప్పుడు కోవిడ్‌ హల్‌చల్‌ చేస్తోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 14,738 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. కేసులతో పోలిస్తే చాలా తక్కువగా 3,591 మంది కోలుకున్నారు. రికార్డుస్థాయిలో 66 మంది కరోనా కాటుకు బలి అయ్యారు.  

11 లక్షలు దాటిన కేసులు..  
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 11,09,650కు పెరిగింది. అందులో 9,99,958 మంది కోలుకున్నారు. మరణాలు 13,112 కి పెరిగాయి. ప్రస్తుతం 96,561 మంది చికిత్స పొందుతుండగా అందులో 555 మంది ఐసీయూలో ఉన్నారు.  

రాజధానిలో 10,497  

  • కేసుల్లో మెజారిటీ భాగం సిలికాన్‌ సిటీదే. బెంగళూరులో తాజాగా 10,497 మంది కోవిడ్‌ బారినపడ్డారు. 1,807 డిశ్చార్జిలు, 30 మరణాలు నమోదయ్యాయి.  
  • సిటీలో మొత్తం కేసులు 5,12,521 కి చేరగా, అందులో 4,35,730 మంది కోలుకున్నారు. 4,963 మంది ప్రాణాలు విడిచారు.  
  • 71,827 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.  

మరణాలు ఎక్కడెక్కడ ఎన్ని?  

  • బెంగళూరులో 30 మంది, బళ్లారిలో 6, బెంగళూరు రూరల్‌లో 6, మైసూరులో 5, హాసనలో 4, ధారవాడలో 3, ఉత్తర కన్నడలో 2, తుమకూరులో 2, బీదర్‌లో 2 చొప్పున మృతి చెందారు. 
  • బెళగావి, కలబురిగి, కొడగు, రామనగర, శివమొగ్గ, విజయపులో ఒక్కొక్కరు మరణించారు. 
  • రాష్ట్రవ్యాప్తంగా గురువారం 1,29,400 శాంపిళ్లను సేకరించారు. మొత్తం పరీక్షల సంఖ్య 2,31,70,964కు చేరింది. ఇక 73,687 మందికి కరోనా టీకా వేశారు. ఫలితంగా మొత్తం టీకాలు 62,74,260 కు చేరింది.   

కరోనాపై డీజీపీకి హైకోర్టు ఆదేశాలు  
శివాజీనగర: రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కట్టడికి కఠిన చర్యల్ని తీసుకోవాలని డీజీపీ ప్రవీణ్‌ సూద్‌కి హైకోర్టు ఆదేశించింది. పలు పిటిషన్లపై గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఏ.ఎస్‌.ఓకా, న్యాయమూర్తి జస్టిస్‌ సూరజ్‌ గోవిందరాజ్‌ల డివిజనల్‌ బెంచ్‌ విచారణ జరిపింది. అంటువ్యాధుల చట్టాన్ని ఉల్లంఘించేవారిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని, జరిమానాలను వసూలు చేయాలని ఆదేశించింది. దీనిపై అన్ని పోలీస్‌ స్టేషన్‌లకు ఆదేశాలు జారీ చేయాలని డీజీపీకి సూచించింది.

చదవండి: అదుపులేని కోవిడ్‌ భూతం: మరి రాత్రి కర్ఫ్యూ ఎందుకు?

Advertisement
 
Advertisement
Advertisement