బెంగళూరు: పోక్సో కేసులో పోలీస్స్టేషన్లో లంచం తీసుకుంటూ మహిళా కానిస్టేబుల్ జ్యోతి లోకాయుక్తకు చిక్కగా, ఏఎస్సై శివశరణప్ప పరారయ్యారు. ఈ సంఘటన కలబుర్గిలోని స్టేషన్ బజార్ పోలీస్స్టేషన్లో జరిగింది. వివరాలు.. చెత్త ఏరుకునే మహిళ కుమార్తె (మైనర్) పై అత్యాచారం జరిగింది. ఈ కేసులో చార్జ్షీట్ వేయాలని, మీకు అనుకూలంగా రాయాలంటే రూ.10 వేలు లంచం ఇవ్వాలని జ్యోతి, ఏఎస్సై శివశరణప్ప బాలిక తల్లిని డిమాండు చేశారు. కూతురిపై అఘాయిత్యం జరిగి బాధపడుతుంటే, పోలీసులు డబ్బుల కోసం పీడించడంతో ఆమె వేదనకు గురైంది. దీంతో కొందరు సామాజిక కార్యకర్తల సాయంతో లోకాయుక్తను ఆశ్రయించింది. ఆమె నుంచి జ్యోతి లంచం తీసుకుటుండగా లోకాయుక్త పోలీసులు దాడి చేశారు. అక్కడే ఉన్న ఏఎస్సై పలాయన మంత్రం పఠించాడు. అతని కోసం గాలిస్తున్నారు.


