
భువనేశ్వర్: పూరీ జిల్లాలో బాలికకు నిప్పు అంటించిన సంఘటనలో పోలీసులకు ఇంత వరకు ఎలాంటి ఆధారం లభించక తల్లడిల్లుతున్నారు. ఈ నిస్సహాయ పరిస్థితి ఆధారంగా విపక్ష బిజూ జనతా దళ్ ఆందోళనలతో విజృంభించింది. ఆదివారం బొలొంగా గ్రామం అటు దర్యాప్తు బృందాల సందర్శన, ఇటు విపక్షం ఆందోళనల హోరు మధ్య బిక్కు బిక్కుమంటున్నారు. మరో 24 గంటల్లో ఆగంతకుల ఆచూకీ గుర్తించ లేకుంటే వీధికి ఎక్కుతామని విపక్ష బిజూ జనతా దళ్ అటు ప్రభుత్వానికి, ఇటు పోలీసులకు బాహాటంగా హెచ్చరించింది. ప్రభుత్వం పెదవి కదపకుండా పరిస్థితిని లోతుగా సమీక్షిస్తోంది. ఈ నేపథ్యంలో మహిళా, శిశు సంక్షేమ శాఖ బాధ్యతలు వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి ప్రభాతి పరిడా నైతికత దృష్ట్యా పదవికి రాజీనామా చేయాలని ఆందోళనకారులు ఒత్తిడి తెస్తున్నారు. పోలీసు భద్రత మధ్య ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అనుక్షణం తాజా పరిణామాల పట్ల దృష్టి సారించారు.
కొనసాగుతున్న విచారణ
ఈ సంఘటనపై విచారణ నిరవధికంగా కొనసాగిస్తున్నారు. సందిగ్ధ వ్యక్తుల్ని పదే పదే ప్రశ్నిస్తున్నారు. శనివారం రాత్రి తొలి దశలో 8 మంది వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించిన మేరకు విడుదల చేశారు. తిరిగి ఆదివారం ఉదయం వీరందర్ని ఠాణాకు రప్పించి విచారణ కొనసాగించారు. వీరిలో బాధిత బాలిక బంధువులు ఉన్నట్లు సమాచారం. అయితే ఆధారాలు, సాక్ష్యాలకు సంబంధించి ధ్రువీకరణ దృఢపడక పోవడంతో ఇంత వరకు అరెస్టుల ఘట్టం ఆరంభం కాలేదు. ఈ తటస్థ వైఖరి పట్ల విపక్ష బిజూ జనతా దళ్ తీవ్రంగా ప్రతిస్పందిస్తుంది. బొలంగా పోలీసు ఠాణా ముట్టడించి మరో 24 గంటల్లోగా నిందితుల్ని గుర్తించి అరెస్టు చేయకుంటే జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన ఉద్ధృతం చేస్తామని ఆదివారం స్పష్టం చేసింది. బొలొంగాలో పరిస్థితి ఉద్రిక్తంగా కొనసాగుతుంది.
ఘటనా స్థలంలో డీజీపీ
బాలికకు నిప్పు అంటించిన సంఘటనలో ఆధారాల అన్వేషణలో సమగ్ర పోలీసు యంత్రాంగం తలమునకలై ఉంది. వైజ్ఞానిక నిపుణుల బృందం సహకారం తీసుకుంటుంది. పోలీసు వర్గాలతో వైజ్ఞానిక, సాంకేతిక నిపుణుల వర్గాలు ఘటనా స్థలం తరచు సందర్శించి నిర్వహిస్తున్న పరిశీలనలో ఇంత వరకు బలమైన ఆధారాలు లభ్యం కానట్లు సమాచారం. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ యోగేష్ బహదూర్ ఖురానియా ప్రత్యక్షంగా ఆదివారం ఘటనా స్థలం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రముఖమైన సాక్షులుగా భావిస్తున్న వారితో ఆయన ముఖాముఖి సంభాషించారు.
పూరీ జిల్లా పోలీసు సూపరింటెండెంటు పినాక్ మిశ్రా ఆయనతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ విచారకర సంఘటనకు సంబంధించి కొంత వరకు సమాచారం లభించినట్లు డీజీపీ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు బలంగా కొనసాగుతుందన్నారు. బలమైన సాక్ష్యాధారాల కోసం నేడు 10 మంది సభ్యులతో కూడిన రెండు వైజ్ఞానిక, సాంకేతిక ప్రత్యేక బృందాలు ఘటనా స్థలంలో పరిసరాలు సందర్శించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్సు లే»ొరేటరి మరియు ఎయిమ్స్ ఫోరెన్సిక్ బృందాలు ఆధారాల సేకరణ కోసం ఘటనా స్థలం వేర్వేరుగా సందర్శించినట్లు వివరించారు. వీరి పరిశీలనలో కొంత మేరకు సమాచారం అందినట్లు ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.