‘స్టార్టప్‌ ఇండియా’ లోపభూయిష్టం | Sakshi
Sakshi News home page

‘స్టార్టప్‌ ఇండియా’ లోపభూయిష్టం

Published Sat, Mar 9 2024 5:50 AM

Bharat Jodo Nyay Yatra: Rahul Gandhi slams Modi startup India - Sakshi

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ

గోధ్రా(గుజరాత్‌): కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువచి్చన ‘స్టార్టప్‌ ఇండియా’ విధానం సరిగ్గా లేదని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఈ విధానం ఫలితంగా దేశంలో ఒక్కటంటే ఒక్క స్టార్టప్‌ కూడా లేదన్నారు. ఉన్నవి కూడా విదేశీ సంస్థల నియంత్రణలోనే నడుస్తున్నాయన్నారు. భారత్‌ జోడో న్యాయ్‌ యాత్ర శుక్రవారం గుజరాత్‌లోని గోధ్రాకు చేరుకుంది.

స్థానిక రైల్వే స్టేషన్‌ సమీపంలో జరిగిన సభలో రాహుల్‌ మాట్లాడారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే స్టార్టప్‌లకు ఊతమిచ్చేందుకు రూ.5 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అదేవిధంగా, 30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. బడా పారిశ్రామిక వేత్తలకు రూ.16 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం రైతులు, విద్యార్థులు, కారి్మకులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. జోడో యాత్ర గురువారం రాజస్తాన్‌ నుంచి దహోద్‌ వద్ద గుజరాత్‌లో ప్రవేశించింది.

రాత్రి దాహోద్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం ఆయన ఝాలోడ్‌ పట్టణ సమీపంలోని కుంబోయి దామ్‌లో గిరిజనులకు ఆరాధ్యుడైన గోవింద్‌ గురుకు నివాళులర్పించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ మహిళా కార్యకర్తలు అందజేసిన భారీ కేక్‌ను తన ఎస్‌యూవీ పైనుంచే రాహుల్‌ కట్‌ చేశారు. గోధ్రాకు వస్తూ శివాలయంలో ఆయన పూజలు చేశారు. గోధ్రా నుంచి సాయంత్రం పావగఢ్‌కు చేరుకుని మా కొడియార్‌ ఆలయంలో పూజలు చేశారు. పంచ్‌మహల్‌ జిల్లా జంబుఘోడా గ్రామంలో రాత్రి బస చేశారు.  
 

Advertisement
Advertisement