80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం | 560 Km Travel in 80 Min For Organs Donation Pune to Hyderabad | Sakshi
Sakshi News home page

80 నిమిషాల్లో 560 కి.మీ ప్రయాణం

Aug 17 2020 9:38 AM | Updated on Aug 17 2020 9:38 AM

560 Km Travel in 80 Min For Organs Donation Pune to Hyderabad - Sakshi

అవయవాలను తీసుకొస్తున్న దృశ్యం

రాంగోపాల్‌పేట్‌: పుణేలోని ఓ ఆసుపత్రిలో బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి లంగ్స్‌ (ఊపిరితిత్తులు) సేకరించారు... అవి అక్క డి నుంచి చార్టెడ్‌ ఫ్లైట్‌లో బేగంపేట ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి మినిస్టర్‌ రోడ్‌లోని కిమ్స్‌ ఆసుపత్రికి చేరుకున్నాయి. మొత్తం 560 కి.మీ దూరం ప్రయాణానికి కేవలం 80 నిమిషాలు పట్టింది... ఇక్కడ సిద్ధంగా ఉన్న ఓ వ్యక్తికి ఆ లంగ్స్‌ను అమర్చే చికిత్సను వైద్యులు మొదలుపెట్టారు. పుణే ట్రాఫిక్‌ పోలీసులు, హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ కారిడార్‌ ద్వారా రెండు ఎయిర్‌పోర్టుల నుంచి రోడ్డు మార్గంలో తరలించే ఏర్పాటు చేయడంతో ఇది సాధ్యమైంది.  

బ్రెయిన్‌డెడ్‌ వ్యక్తి నుంచి సేకరించి 
ఆదివారం ఉదయం పుణేలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఓ వ్యక్తి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడు. ఆ వ్యక్తి మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్న కుటుంబసభ్యులు అవయవదానం చేసి మరో నలుగురి ప్రాణం పోయాలని మానవత్వంతో ముందుకొచ్చారు. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి ఊపిరితిత్తుల దాత కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నాడు. జీవన్‌ధాన్‌  డాక్టర్‌ స్వర్ణలత, పుణేలో జడ్‌టీసీసీ సెంట్రల్‌ కో–ఆర్డినేటర్‌ ఆర్తిగోఖలే.. పుణే బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తి నుంచి ఊపిరితిత్తులను సేకరించి హైదరాబాద్‌ కిమ్స్‌ హార్ట్‌ అండ్‌ లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ ఇనిస్టిట్యూట్‌ లో చికిత్స పొందుతున్న వ్యక్తికి అమర్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.

బ్రెయిన్‌డెడ్‌ అయిన వ్యక్తి నుంచి శస్త్రచికిత్స ద్వారా లంగ్స్‌ను సేకరించారు. పుణే ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు  గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. 11 కిమీ దూరం ఉండే పుణే ఎయిర్‌పోర్టుకు 20 నిమిషాల్లో అంబులెన్స్‌ చేరుకుంది. అప్పటికే ఎయిర్‌పోర్టులో సిద్ధంగా ఉన్న చార్టెడ్‌ ఫ్లైట్‌ ఆ ఆర్గాన్స్‌తో పుణే నుంచి బయలుదేరి 4.30 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. నగర ట్రాఫిక్‌ అదనపు కమిషనర్‌ ఆదేశాల మేరకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి సికింద్రాబాద్‌ కిమ్స్‌ ఆస్పత్రి వరకు బేగంపేట ట్రాఫిక్‌ పోలీసులు గ్రీన్‌ కారిడార్‌ ఏర్పాటు చేశారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి 2.9 కి.మీ దూరం ఉండే కిమ్స్‌ ఆసుపత్రికి 2 నిమిషాల 5 సెకన్లలో అంబులెన్స్‌లో ఆర్గాన్‌ను చేర్చారు. అప్పటికే సిద్ధంగా ఉన్న కిమ్స్‌ వైద్యుల బృందం ఆర్గాన్‌ను మరో వ్యక్తికి అమర్చే శస్త్రచికిత్స మొదలెట్టారు. ఈ ఆపరేషన్‌ పూర్తి కావడానికి సుమారు 6 నుంచి 8 గంటలు పడుతుందని వైద్యులు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement