నారాయణపేట: మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి జిల్లాలో చేపడుతున్న భూ సేకరణ ప్రక్రియను సెప్టెంబర్ 30లోగా పూర్తి చేయాలని కలెక్టర్ సీహెచ్ ప్రియాంక అధికారులను ఆదేశించారు. బుధవారం సా యంత్రం కలెక్టరేట్లోని వీసీ హాల్లో రెవెన్యూ అదనపు కలెక్టర్ శ్రీనుతో కలిసి రెవెన్యూ అధికారులతో భూ సేకరణపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భూ సేకరణలో రెవెన్యూ అదనపు కలెక్టర్, ఆర్డీవోలు, ప్రత్యేక అధికారులు సమన్వయంతో పనిచేయాల ని సూచించారు. పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని, రైతుల నుంచి కన్సెంట్ తీసుకుని అవార్డుల ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. అవసరమైతే ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి పనులను వేగంగా పూర్తి చేయాలన్నారు. లక్ష్మీపూర్ ట్యాంక్ ప్రాంతానికి సంబంధించిన పనులకు ప్రాధాన్యం ఇవ్వాలని, దామరగిద్ద మండలంలోని గత్ప, విఠలాపూర్, అన్నాసాగర్ తదితర గ్రామాల్లో భూ సేకరణను వేగవంతం చేయాలని సూచించారు. ఆర్ఐలు తమ పరిధిలో పట్టాల పరిశీలన పూర్తిచేసి నాలుగు రోజుల్లో సర్వేను ముగించాలని, ఇందుకోసం నాలుగు సర్వే బృందాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రోజూ గ్రామాల వారీగా ఎన్ని ఎకరాల భూసేకరణ పూర్తయిందనే ప్రగతిని తానే స్వయంగా సమీక్షిస్తానని కలెక్టర్ తెలిపారు. సాకులు చెప్పకుండా నిర్దేశించిన లక్ష్యాల మేరకు పనిచేయాలని, పని చేయలేని వారు తప్పుకోవాలని హెచ్చరించారు. గుండుమాల్, కోస్గి మండలాల్లో భూ సేకరణ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. పీఏ్ సూచనల మేరకు రోజూ ప్రగతిని సమీక్షిస్తామని పేర్కొన్నారు. సమీక్షలో డీఆర్ఓ రాజ్యలక్ష్మి, ఆర్డీఓ రమేష్, ఎస్డీసీ రాజేందర్గౌడ్, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.


