ప్రత్యర్థులకు అవకాశమేనా?
నేతలంతా ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్న చందంగా..
–8లో u
నారాయణపేట: జిల్లా బీజేపీలో అంతర్గత విభేదాలు మరో సారి తెరపైకి వచ్చాయి. నేతలంతా ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా ఉంటుండడంతో పార్టీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తుంది. ఈ నెల 21న నిర్వహించిన మేథావుల సమావేశానికి జిల్లాకు చెందిన ఎంపీకి సమాచారం ఇవ్వలేదన్న ప్రచారం పార్టీలో ప్రకంపనలు రేపుతోంది. సమావేశానికి వస్తున్నారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు స్వయంగా ఆరా తీయగా.. ‘నాకు సమాచారం లేదు‘ అని ఎంపీ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఎంపీని ఉద్దేశపూర్వకంగానే పక్కన పెట్టారా? తెరవెనుక ఈ వ్యవహారాన్ని నడిపించింది ఎవరు? అనే ప్రశ్నలు కమలం పార్టీలో తీవ్ర చర్చకు దారితీశాయి. రాష్ట్ర అధ్యక్షుడు హాజరైన సమావేశానికి స్థానిక ఎంపీకి సమాచారం అందించకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. ఇది కేవలం సమన్వయ లోపం మాత్రమే కాదని అంతకు మించి ఎత్తుగడలు చోటుచేసుకున్నాయని పలువులు చర్చించుకుంటున్నారు.
ఆధిపత్య పోరు..
బయటకు అంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. బీజేపీలో నేతల మధ్య ఆధిపత్య పోరు ముదురుతోందనే సంకేతాలు వెలువడుతున్నాయి. మేథావుల సమావేశానికి ఎంపీ గైర్హాజరు, మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నికల తర్వాత పెరిగిన అసంతృప్తి, కో–ఆప్షన్ సభ్యుల ఎంపికపై నెలకొన్న ప్రతిష్టంభన పార్టీలో చోటు చేసుకున్న విభేదాలకు అద్దం పడుతున్నాయి. రాష్ట్ర నాయకత్వం జోక్యం చేసుకోకపోతే జిల్లాలో బీజేపీకి రాజకీయంగా ఇబ్బందులు తప్పవన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కో–ఆప్షన్ సభ్యుల ఎంపికలోనూ..
మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుల ఎంపిక అంశం కూడా పార్టీకి తలనొప్పిగా మారిందని సమాచారం. ఎవరికీ అవకాశం ఇవ్వాలన్న దానిపై నాయకుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయం ఆలస్యమవుతోందని తెలుస్తోంది. స్థానిక నాయకత్వం ఒక పేరును ప్రతిపాదిస్తే.. మరో వర్గం ఇంకో పేరును ముందుకు తెస్తోందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనిపై ద్వితీయ శ్రేణి నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన తమకు పదవులు వచ్చే సమయంలో అగ్ర నాయకులు తలోదారి చూసుకోవడం సరైంది కాదంటున్నారు.
జిల్లాలో కాంగ్రెస్ అన్ని ఎమ్మెల్యే స్థానాలను కై వసం చేసుకోగా.. బీఆర్ఎస్ కూడా పునర్వ్యవస్థీకరణలో ఉంది. ఇలాంటి సమయంలో బీజేపీ అంతర్గత విభేదాలు మరింత పెరిగితే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకే లాభం చేకూరే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పేటలో బీజేపీకి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. కానీ నేతల మధ్య నెలకొన్న విభేదాలతో క్యాడర్ ఎవరిని అనుసరించాలో తెలియక ప్రస్తుతం స్తబ్ధుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎవరిని ఫాలో అయితే ఎవరి ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందోనని భయపడి కార్యకర్తలు వేచిచూసే ధోరణిలో ఉన్నారు. ఇదే అదనుగా ప్రత్యర్థి పార్టీలు కేంద్ర ప్రభుత్వంలో ప్రధాని మోదీ వైఫల్యాలను ఎండగడుతూ జిల్లాలో బీజేపీని దెబ్బతీసేలా దూకుడు పెంచుతున్నాయి. సరైన మార్గనిర్ధేశం లేకపోవడంతో పార్టీ శ్రేణులు కనీస వాటిని ఖండించలేని స్థితిలో ఉన్నారని.. ఇది ఇలాగే కొనసాగితే 2028 ఎన్నికల్లోనూ జిల్లాలో బీజేపీకి భంగపాటు తప్పదని చర్చ జరుగుతోంది.
మేధావుల
సమావేశానికి
ఎంపీ గైర్హాజరుతో
గందరగోళం
మున్సిపల్
చైర్పర్సన్ ఎన్నిక తర్వాత
అసంతృప్తి జ్వాల
మూడు వర్గాలుగా విడిపోయిన నాయకులు
ఆందోళనలో
పార్టీ శ్రేణులు


