నారాయణపేట రూరల్: విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లాలో మంగళవారం నిర్వహించిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా కేంద్రంలో సంఘం నాయకులు ప్రభుత్వ పాఠశాల్లో తరగతులను బహిష్కరించగా, ప్రైవేట్ పాఠశాలలు స్వచ్ఛందంగా సెలవు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ నరేష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేస్తుందని, బడ్జెట్ కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని, ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. సర్కారు బడుల మూసివేతపై సీఎం రేవంత్రెడ్డి తన నిర్ణయాన్ని వెనిక్కి తీసుకోవాలని కోరారు. ప్రైవేట్, కార్పొరేట్ విద్య సంస్థల్లో అధిక ఫీజులను నియంత్రించాలని, పేద విద్యార్థులకు 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలన్నారు. జాతీయ విద్యా విధానం అమలు చేయాలని, రాష్ట్రంలో అన్ని పాఠశాలల్లో వెంటనే బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నాయకులు సతీష్, ఇంతియాజ్, చరణ్ రెడ్డి, శివ, తరుణ్, రవి, ఉదయ్, అభి, గణేష్ తదితరులు పాల్గొన్నారు.


