జిల్లాలో విస్మరించిన అధికారులు, నిర్వాహకులు
నారాయణపేట రూరల్: పాఠశాల విద్యార్థులకు పుస్తకాల సంచుల భారం నుంచి నెలలో ఒక్కరోజైనా విముక్తి కల్పిస్తూ.. శారీరకంగా, మానసికంగా దృఢంగా తయారుచేసేందుకు ప్రభుత్వం నో బ్యాగ్ డేను గత విద్యాసంవత్సరం అమలులోకి తీసుకొచ్చింది. ప్రతి నెల నాలుగో శనివారం పాఠశాల విద్యార్థులు పుస్తకాలు లేకుండా పాఠశాలకు వచ్చేలా కార్యక్రమాన్ని రూపొందించింది. ఒకటి నుంచి పదోతరగతి వరకున్న విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికితీసేందుకు 28 రకాల కార్యకలాపాలు సూచిస్తూ అందులో ప్రతి నెల ఒక కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. వీటిలో ఆటలు, పిల్లలకు కథలు చెప్పడం, శాస్త్ర సాంకేతికత అభివృద్ధి, క్షేత్రస్థాయి పర్యటనలు, చిత్రలేఖనం, చారిత్రాత్మక ప్రదేశాలు, పంచాయతీ కార్యాలయాలు, మ్యూజియం సందర్శన, మాదిరి ఎన్నికలు, నమూనా శాసనసభ, కృత్రిమ మేధా వంటి వాటికి చోటు కల్పించింది. ప్రారంభంలో జిల్ల్లాలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు నిర్వహించినా తర్వాత అమలును విస్మరించారు. నో బ్యాక్ డే అమలులో ఆశించిన పురోగతి కనిపించడం లేదు. సంచి రహిత రోజును చిన్నచూపుగా చూడటం ఆందోళన కలిగిస్తుంది.
పాఠశాలల వారీగా వివరాలు..
అమలు చేయాలి..
ప్రభుత్వం రూపొందించిన నో బ్యాగ్ డే కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో అమలు జరిగే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో నెలలో ఒకరోజు పిల్లలకు తప్పకుండా బ్యాగ్ నుంచి విముక్తి కల్పించాలి. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తే వారు ఉల్లాసంగా గడపడంతో వారిలో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత లభిస్తుంది.
– నరేష్, జిల్లా కన్వీనర్, ఏబీవీపీ
చర్యలు తీసుకుంటాం..
ప్రభుత్వం సదుద్దేశంతో ప్రవేశపెట్టిన నో బ్యాగ్ డేను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విధిగా అమలు చేసేలా తగిన చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పిల్లలకు పాఠ్యాంశేతర కార్యక్రమాలు నిర్వహించే విధంగా ఎంఈఓలు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిస్తాం. విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తాం.
– డా. గోవిందరాజు, జిల్లా విద్యాధికారి
విద్యార్థులకు దొరకని ఆటవిడుపు
కాగితాలకే పరిమితమైన వైనం
ఈ ఏడాదైనా ప్రాధాన్యత లభించేనా..?


