ధన్వాడ: ఎల్నినో ప్రభావంతో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్ సూచించారు. గురువారం మండల కేంద్రంలోని విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేసి నిల్వలు, రికార్డులు, గోదాములను తనిఖీ చేశారు. అనంతరం పాతపల్లి నిర్వహించిన రైతు అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో వర్షాకాలంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, మరికొన్ని ప్రాంతాల్లో వర్షం లేకపోవడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చన్నారు. కావున రైతులు రెండు, మూడు రోజుల్లో 50 మి.మీ. నుంచి 75 మి.మీ. వర్షపాతం కురిసి భూమిలో తగినంత తేమ ఏర్పడిన తర్వాతే వర్షాధార విత్తనాలు విత్తాలని సూచించారు. భూమిలో తగినంత తేమ లేకుండా విత్తనాలు విత్తితే సరిగా మొలకెత్తవని.. ఫలితంగా తిరిగి విత్తాల్సి రావడంతో రైతులు నష్టపోతారని తెలిపారు. స్వల్పకాలిక పంటలైన పెసర, మినుము.. వర్షాభావ పరిస్థితులను తట్టుకునే కంది, జొన్న, సజ్జ, నువ్వుల పంటలు సాగుచేయాలని సూచించారు. రైతులు పంటల సాగుకు వ్యవసాయ అధికారుల సలహాలు సూచనలు పాటించాలన్నారు. ఆయన వెంట ఏఓ నవీన్కుమార్ ఉన్నారు.


