పాఠశాలల్లో పనికిరాని పాత్రలు తీసివేయాలి. మిగిలిన వాటిని వేడి నీటితో శుభ్రం చేయాలి. వంట గదులు స్వచ్ఛంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. గదులతో పాటు గోడలు, పైకప్పు బూజు, ఇతర చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. సిబ్బంది తప్పకుండా చేతికి గ్లౌజులు, ముఖానికి మాస్కు ధరించి వంట చేయాలి. ప్రభుత్వం రూపొందించిన పట్టిక ప్రకారం భోజనాన్ని సిద్ధం చేయాలి. నాణ్యత లోపించకుండా చూసుకోవాలి. ఆహార కమిటీలను నియమించి పర్యవేక్షణ పెంచాల్సి ఉంటుంది. పోషకాహార లోపంతో ఎంతో మంది పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. దీనిని అధిగమించేందుకు ప్రభుత్వం వారానికి మూడు రోజులు కోడిగుడ్లు, పలు పోషక విలువలతో కూడిన ఆహారం అందించేందుకు చర్యలు తీసుకోనుంది. మెనూ ప్రకారం విద్యార్థులకు ఆహారం అందించనున్నారు.


