పకడ్బందీగా నిర్వహిస్తాం..
ప్రాథమిక విద్య బలోపేతానికి ప్రభుత్వం కార్యాచరణ
నారాయణపేట రూరల్: జిల్లాలోని ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ఇతర గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రాథమిక తరగతుల (1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు) విద్యార్థులకు అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం నైపుణ్యాలను మరింత బలోపేతం చేసేందుకు ఈ విద్యా సంవత్సరంలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరాసి (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమాన్ని కొనసాగించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు ప్రాథమిక స్థాయిలోనే చదవడం, రాయడం, గణిత నైపుణ్యాలను సమర్థవంతంగా అభివృద్ధి చేసుకునే పలు కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
నాలుగు సబ్జెక్టులకు..
తెలుగు, ఉర్దూ, ఆంగ్లం, గణితంలో ఎఫ్ఎల్ఎన్ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గణితం, తెలుగు, ఆంగ్లంలో వెనుకబడిన విద్యార్థుల కోసం కృత్రిమ మేధా ఆధారిత ఏఎక్స్ఎల్ సహాయక కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు. వారానికి రెండుసార్లు ప్రతిసారి 20 నిమిషాల పాటు ప్రత్యేక అభ్యాసన సెషన్లు నిర్వహించాలని సూచించారు. కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేసేందుకు జిల్లా, మండల, పాఠశాలస్థాయిలో ఎఫ్ఎల్ఎన్ సెల్లను ఏర్పాటు చేస్తున్నారు. ఎస్సీఈఆర్టీ రూపొందించిన టీచర్ అండ్ బుక్స్, మైక్రో కంపిటెన్సీలు, బోధనా ప్రణాళికలను తప్పనిసరిగా వినియోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. విద్యార్థుల అభ్యాసన పురోగతిని అంచనా వేయడానికి ఈ ఏడాది జులై 1 నుంచి 10 వరకు బేస్లైన్ టెస్ట్, నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు మిడిల్ లైన్ టెస్ట్, అదేవిధంగా 2027, మార్చి ఏడు నుంచి 17వ తేదీ వరకు ఫైనల్ లైన్ టెస్ట్ ద్వారా అంచనాలు నిర్ణయిస్తారు.
పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలి..
ప్రతి ఎఫ్ఎల్ఎన్ పాఠం అనంతరం విద్యార్థులు వర్క్ షీట్లను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాటిని ఉపాధ్యాయులు వెంటనే మూల్యాంకనం చేసి అవసరమైన విద్యాసాయాన్ని అందించాలి. మల్టీ లెవెల్ తరగతుల్లో టీచర్ సపోర్ట్ గ్రూపులు, పీర్ సపోర్ట్ గ్రూపుల ద్వారా పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
అదనపు శిక్షణ..
విద్యలో వెనుకబడిన విద్యార్థుల కోసం ప్రత్యేక బోధన కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. రోజు పాఠశాల అనంతరం మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 4 వరకు తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్, గణితంలో అదనపు శిక్షణ ఇవ్వనున్నారు. డీఈఓ, ఎంఈఓలతో పాటు కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు, అకాడమిక్ మానిటరింగ్ బృందాలు పాఠశాలలను సందర్శించి పర్యవేక్షణ చేయనున్నాయి.
ప్రతి నెలా సమీక్షలు..
ప్రతి నెల 20వ తేదీన పాఠశాల స్థాయిలో, 27న మండలస్థాయిలో, 28న జిల్లాస్థాయిలో, 29న రాష్ట్రస్థాయిలో సమీక్ష సమావేశాలు నిర్వహించనున్నారు. ఇక పాఠశాలలో అదనంగా రోజు కనీసం 30 నిమిషాల పాటు లైబ్రరీ పీరియడ్ నిర్వహించి విద్యార్థుల్లో పఠనాసక్తిని పెంపొందించనున్నారు. 3వ తరగతి పూర్తయ్యే నాటికి ప్రతి విద్యార్థి ప్రాథమిక పఠన, రచన, గణిత సామర్థ్యాలను పూర్తిస్థాయిలో సాధించేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా విద్యాశాఖ భావిస్తోంది.
మద్దూరు మండలం
భీంపూర్ ప్రాథమిక
పాఠశాలలో ఎఫ్ఎల్ఎన్ పిల్లల సర్వే (ఫైల్)
జిల్లాలో ఇలా..
జిల్లాలో ఎఫ్ఎల్ఎం కార్యక్రమాన్ని పకడ్బందీగానిర్వహించి విజయవంతంగా పూర్తి చేసేందుకు కృషి చేస్తాం. ప్రాథమిక తరగతుల విద్యార్థులు తెలుగు, ఆంగ్లం, ఉర్దూలో చదవడం, రాయడం, గణితంలో సంఖ్యాజ్ఞానం పెంపొందించి మూడుసార్లు పరీక్షలు నిర్వహిస్తాం. వెనుకబడిన విద్యార్థులకు ఏఐ ఆధారిత సాయం అందిస్తాం. పర్యవేక్షణ కమిటీల ద్వారా నివేదికలు తీసుకుంటాం.
– గోవిందరాజు, జిల్లా విద్యాధికారి
ఎస్ఎల్ఎన్
నిర్వహణకు విద్యాశాఖ ఆదేశాలు
చిన్నారుల
అక్షరాస్యత,
సంఖ్యా పరిజ్ఞానంపై
ప్రత్యేక దృష్టి
నెలవారీ సమీక్షలతో పర్యవేక్షణ


