నిధులున్నా.. నత్తనడకే! | - | Sakshi
Sakshi News home page

నిధులున్నా.. నత్తనడకే!

Jun 13 2026 1:17 PM | Updated on Jun 13 2026 1:17 PM

ముందుకుసాగని ఎత్తిపోతల మరమ్మతులు

సరళాసాగర్‌ ప్రధాన పైప్‌లైన్‌.. ‘అమరచింత’ సెక్షన్‌ పైపులఏర్పాటులో ఆలస్యం

మొదలైన వానాకాలం పంటల సాగు

పనులు పూర్తయితేనే ఆయకట్టుకు

నీటి విడుదల

రైల్వే పనులతోనే ఆలస్యం..

రైల్వే అధికారులు వంతెన నిర్మాణం చేపట్టడంతో పైప్‌లైన్‌ పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవించాం. వంతెన పనులు పూర్తయిన వెంటనే పైప్‌లైన్‌ ఏర్పాటు ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేస్తాం.

– వరప్రసాద్‌, ఏఈ, రామన్‌పాడ్‌ జలాశయం

అగ్రిమెంట్‌ పూర్తి కాలేదు..

అమరచింత ఎత్తిపోతల సెక్షన్‌ పైపుల ఏర్పాటుకు రూ.46 లక్షలు మంజూరయ్యాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ చేసుకోవాల్సి ఉంది. అగ్రిమెంట్‌ పూర్తయిన 15 రోజుల్లో సెక్షన్‌ పైపుల ఏర్పాటు పూర్తి చేస్తాం. – వంశీకృష్ణ,

ఏఈఈ అమరచింత ఎత్తిపోతల పథకం

అమరచింత/మదనాపురం: జిల్లాలోని సరళాసాగర్‌ ప్రధాన పైప్‌లైన్‌, అమరచింత ఎత్తిపోతల పథకానికి సంబంధించి సెక్షన్‌ పైపుల ఏర్పాటులో జాప్యం కారణంగా వానాకాలం పంటల సాగుపై ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది. సరళాసాగర్‌ కింద 3,200 ఎకరాలు, అమరచింత ఎత్తిపోతల కింద 2,200 ఆయకట్టు ఉంది. మరమ్మతుల కారణంగా పూర్తి ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందని పరిస్థితులు నెలకొన్నాయి. యాసంగి సీజన్‌లో క్రాప్‌ హాలిడే ప్రకటించడంతో సాగుకు దూరంగా ఉన్న ఆయకట్టు రైతులు వానాకాలం పంటల సాగు కోసం ఇప్పటికే పొలాలను దుక్కిదున్ని చదును చేసి సిద్ధంగా ఉంచారు. కానీ ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా పనులు పూర్తిగాకపోవడంతో వానాకాలం పూర్తి ఆయకట్టుకు నీరందని పరిస్థితి నెలకొంది. సరళాసాగర్‌ పైప్‌లైన్‌ నిర్మాణానికిగాను రూ.49.50 లక్షలు, అమరచింత ఎత్తిపోతల సెక్షన్‌ పైప్‌ల ఏర్పాటుకు రూ.46 లక్షలు ప్రభుత్వం మంజూరు చేసింది. ఆయా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా మరమ్మతులు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉందని ఆయకట్టు రైతుల్లో ఆందోళన నెలకొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement