కమీషన్లు రావనే భూమా విఖ్యాత్
తలనీలాల వాహనాన్ని అడ్డుకున్నారు
పవన్ కల్యాణ్కు అహోబిలంలో జరిగే అక్రమాలు కనిపించడం లేదా!
ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి
భూమా వారసులు
నంద్యాల: అహోబిలం దేవుని సొమ్మును ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఆమె సోదరుడు భూమా జగత్ విఖ్యాత్రెడ్డి దోచుకుంటున్నారని ఆళ్లగడ్డ మాజీ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్రెడ్డి విమర్శించారు. మంగళవారం నంద్యాల పట్టణంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భూమా వారసులు అహోబిలం టోల్గేట్లలో అక్రమ వసూళ్లతో పాటు తలనీలాల కమీషన్ల కోసం బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తలనీలాల కమీషన్లు రావడం లేదని భూమా జగత్ విఖ్యాత్రెడ్డి తలనీలాల వాహనాన్ని అడ్డుకుని భయభ్రాంతులకు గురి చేశారన్నారు. గత ఏడాది తలనీలాల వేలం రూ.1.50 కోట్లకు పాడుకొని అందులో రూ.50 లక్షలు మాత్రమే చెల్లించి రూ.కోటి చెల్లించలేదన్నారు.
ఈ ఏడాది అహోబిల మఠం వారు టెండర్లు పెట్టకుండా అడ్డుకుంటున్నారని, ఎవరైనా టెండర్లు వేయడానికి వస్తే భయపెడుతున్నారన్నారు. ఇటీవల టెండర్ల కోసం రూ.2 లక్షలు డీడీలు తీసిన వ్యక్తిని అఖిలప్రియ అనుచరులు ప్రాణం మీద ఆశ ఉంటే వచ్చి చేసుకో అంటూ భయపెట్టారని, అందుకు సంబంధించిన వీడియోను విలేకరుల ముందు ప్రదర్శించారు. అహోబిలం తలనీలాలు చైన్నెకి చెందిన కాంట్రాక్టర్కు అహోబిలం మఠం వారు తీసుకొని వెళ్తుంటే అడ్డుకొని హంగామా సృష్టించడం ఏమిటని ప్రశ్నించారు. ఒక వేళ తలనీలాలు దొంగతనంగా తీసుకెళితే మఠం అధికారులు కేసు పెడతారు కదా.. మీకేంటి అంత తొందర అంటూ ప్రశ్నించారు. అహోబిలం దేవుని సొమ్ము దోచుకుంటూ మళ్లీ మీరే సిగ్గు లేకుండా దొంగే.. దొంగ.. దొంగ అని అరిచినట్లు మాపై విమర్శ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే చంద్రబాబు, పవన్కల్యాణ్లకు అహో బిలం దోపిడీ కనిపించడం లేదా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విచారణ చేపట్టి భూమా వారసుల అవినీతి, అక్రమాలను అడ్డుకోవాలన్నారు.


