కోవెలకుంట్ల: రాయలసీమ జిల్లాలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి జలయజ్ఞం చేపట్టారు. రెండు టీఎంసీల సామర్థ్యం ఉన్న అవుకు రిజర్వాయర్ను రూ. 70 కోట్లతో నాలుగు టీఎంసీల సామర్థ్యానికి పెంచేందుకు 2005 నవంబర్లో శంకుస్థాపన చేశారు. దీని ద్వారా కర్నూలు, వైఎస్సార్ జిల్లాల్లో 77,200 ఎకరాలకు సాగునీరు, రిజర్వాయర్కు అనుసంధానంగా జీఎన్ఎస్ఎస్ వరద కాల్వ నుంచి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.67 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో 20 లక్షల మందికి తాగు నీరు అందించాలన్నది లక్ష్యం. శ్రీశైలం జలాశ యం నుంచి అవుకు రిజర్వాయర్లోకి నీరు చేరేందుకు 30వ ప్యాకేజీ కింద రూ. 401 కోట్లతో 12 కిలోమీటర్ల మేర రెండు సొరంగ మార్గాలను నిర్మించి వీటి ద్వారా 20 వేల క్యూసెక్కుల వరద జలాలను రిజర్వాయర్లో నింపాల్సి ఉంది. 2010 నాటికే ఒక సొరంగం గుండా వైఎస్సార్ జిల్లా గండికోటకు నీటిని విడుదల చేయాలి. వైఎస్సార్ మరణం తర్వాత కిరణ్ సర్కార్, 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం జలయజ్ఞం పనులను నిర్లక్ష్యం చేయడంతో పదిశాతం పనులు పెండింగ్లో ఉన్నాయి. 2019లో అధికారంలో వచ్చిన జగన్ సర్కార్ ఆ పనులను పూర్తి చేసి ఒక్కో సొరంగం ద్వారా పదివేల క్యూసెక్కుల నీటి విడుదలకు మార్గం సుగమం చేసింది. శ్రీశైల జలాశయం నుంచి వరద జలాలను మళ్లించేందుకు వీలుగా రెండు సొరంగ మార్గాలు ఉండగా మూడో సొరంగ నిర్మాణ పనులు చేపట్టింది. రూ. 300 కోట్లతో 5.9 కి.మీ పొడవునా నిర్మాణ పనులకు నిధులు కేటాయించింది. అలాగే పాణ్యం మండలం గోరుకల్లు నుంచి అవుకు రిజర్వాయర్ వరకు లైనింగ్ పనులకు రూ. 950 కోట్లు విడుదల చేసింది. గత ప్రభుత్వ హయాంలో ఆయా ప్రాంతాల్లో లైనింగ్ పనులు పూర్తయ్యాయి. వైఎస్సార్ కల సాకారమై అవుకు రిజర్వాయర్ సీమ జిల్లాలకు కల్పతరువుగా మారింది.
అవుకు రిజర్వాయర్


