కర్నూలు బహుళార్ధ పశు వైద్యశాలలో యాంటీ రేబిస్ టీకాల కార్యక్రమం
కర్నూలు(అగ్రికల్చర్): జంతువుల నుంచి మనుషులకు సోకే వ్యాధుల పట్ల అవగాహన పెంచుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ రాజశేఖర్ సూచించారు. సోమవారం ప్రపంచ జూనోసిస్ దినోత్సవం పురస్కరించుకొని కర్నూలులోని బహుళార్థ పశువైద్యశాల, అన్ని ఏరియా పశు వైద్యశాలల్లో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు వేసే కార్యక్రమం చేపట్టారు. బహుళార్థ పశువైద్యశాలలో పెంపుడు కుక్కలకు యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేసే కార్యక్రమాన్ని రాజశేఖర్ ప్రారంభించారు. శిబిరంలో 600 పెంపుడు కుక్కలు, పిల్లులకు టీకాలు వేశారు. వాటి యజమానులు, పశుపోషకులకు జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెంపుడు జంతువులకు తప్పనిసరిగా యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలన్నారు. రేబిస్కు మందు లేదని నివారణే మార్గమన్నారు. ఒకేరోజు 7500 డోసుల రేబిస్ టీకాలు వేయడం జరిగిందని మంగళవారం కూడా టీకాల కార్యక్రమం కొనసాగుతుందన్నారు. కర్నూలు డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ వసంతలక్ష్మి, జిల్లా పశువ్యాధి నిర్ధారణ కేంద్రం సహాయ సంచాలకులు డాక్టర్ మాధవి, వీపీసీ అసిస్టెంట్ డైరెక్టర్లు సుధాకర్, గిడ్డయ్య, చంద్రలీల, పలువురు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్లు తదితరులు పాల్గొన్నారు.


