హొళగుంద: మండలంలో సోమవారం ఢిల్లీ నుంచి వచ్చిన నీతి ఆయోగ్ అధికారి బంగార్రాజు పర్యటించారు. గజ్జహళ్లి ప్రాథమిక ఆరోగ్యకేంద్రం, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, పశువైద్య కేంద్రం, కేజీబీవీతో పాటు పలు శాఖలకు చెందిన కార్యాలయాలు తిరిగి అక్కడ సంపూర్ణ అభియాన్ (నీతి అయోగ్ ఆస్పిరేషనల్ బ్లాక్ )–2.0 కార్యక్రమం అమలు, రికార్డులు, కేపీఐ సూచికలను సమీక్షించి ఇతర అంశాల పై ఆరా తీశారు. గ్రామాలలో తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, పాఠశాలల్లో టీచర్ల కొరత, విద్యార్థులకు కావాల్సిన మౌలిక సదుపాయాలు, రైతుల సంక్షేమం, పొదుపు మహిళలకు స్వయం ఉపాధి కల్పన ఇలా అనేక అంశాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల్లో సౌకర్యాలు, తాగునీరు, మరుగుదొడ్ల వసతి, ఎదురవుతున్న సవాళ్లపై వివరాలను తెలుసుకున్నారు. అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా శాఖాధికారులతో సమీక్ష నిర్వహించారు. గ్రామాల్లో పేదరిక నిర్మూలనే లక్ష్యంగా అన్ని శాఖల అధికారులు విధులు నిర్వర్తించాలన్నారు. ఎంపీడీఓ సయ్యద్ఉమర్, ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో రవిశంకర్, వివిధ శాఖల మండల అధికారులు పాల్గొన్నారు.
కర్నూలు (టౌన్): నగరంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే తగిన చర్యలు తీసుకుంటామని నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు స్పష్టం చేశారు. సోమవారం స్థానిక మునగాలపాడు రోడ్డు, సంపత్ నగర్, సంతోష్ నగర్, బళ్లారి చౌరస్త, కృష్ణా నగర్ ప్రాంతాల్లో పారిశుద్ధ్య తనిఖీలు నిర్వహించారు. స్థానికంగా పి.ఆర్ వైన్స్ వద్ద అపరిశుభ్ర వాతవరణం ఉండటంతో అసహనం వ్యక్తం చేసిన కమిషనర్ రూ.10 వేలు జరిమానా విధించారు.


