ఆత్మకూరురూరల్: వర్షకాలం ప్రారంభమై నెల దాటినా చినుకు రాలక రైతులంతా ఆందోళనలతో ఆకాశం వైపు చూస్తున్న సంగతి తెలిసిందే. వరుణు డు ముఖం చాటేయడంతో రైతులు వరుణాధి దేవతలను ఆదేశించగలిగే దైవాలకు కొలుపులు మొదలు పెడుతున్నారు. ఆత్మకూరు మండలంలోని నల్లకాల్వ గ్రామ రైతులు మతాలకతీతంగా ఏకమై సోమవారం గ్రామ సమీప నల్లమల అడవుల్లో వెలసిన జడలయ్య (శివుడు) స్వామి వద్దకు వెళ్లి పూజల అనంతరం వనభోజనాలు చేశారు. ముందుగా జడలయ్య స్వామి విగ్రహానికి అక్కడి పవిత్ర కోనేరు నీటితో అభిషేకాలు నిర్వహించారు. ఈ కోనేరులో మండు వేసవిలోనూ, నిండు వర్షాకాలంలోనూ భూమి ఉపరితలానికి సమానంగా నీరు ఉండటం గమనార్హం. అనంతరం స్వామి సన్నిధిలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం రైతులంతా కలిసి వనభోజనాలు చేశారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మతాలను పాటించే రైతులంతా ఒక చోట చేరి సమష్టిగా ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


