కలవరపెడుతున్న జూనోసిస్ వ్యాధులు
అవగాహనతోనే వాటి నివారణ
వీధి కుక్కల నియంత్రణలో చేతులెత్తేసిన ప్రభుత్వం
నేడు ప్రపంచ జూనోసిస్ డే
మనిషికి అనాదిగా జంతువులతో అవినాభావ సంబంధం ఉంది. చాలా మంది పశువుల పెంపకం, గొర్రెలు–మేకల పెంపకం, కోళ్ల పెంపకం వంటి వాటిని వృత్తిగా పెట్టుకున్నారు. ప్రతి మనిషి పశుపక్ష్యాదుల నుంచి ఉత్పత్తి అయ్యే పాలు,గుడ్లు, మాంసం తదితర వాటిపై ఆధారపడి ఉన్నాడు. ఇదే సమయంలో ఇంటి రక్షణ కోసం మొదలైన కుక్కల పెంపకం క్రమంగా హాబీగా మారింది. ఇలా మనుషులు, జంతువులు నిరంతరం కలసి పోతుండటం వల్ల తెలియకుండానే వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తున్నాయి. ఈ వ్యాధుల నివారణే లక్ష్యంగా పరిశోధనలు పెంచడం, పెంపుడు జంతువులకు వ్యాక్సిన్లు వేయించేలా ప్రజలను చైతన్యం చేసేందుకు ప్రతి ఏడాది జూలై 6న జూనోసిస్ డే నిర్వహిస్తారు.
కర్నూలు(అగ్రికల్చర్): జంతువుల నుంచి మనుషులకు ఇటీవల వ్యాధులు పెరుగుతున్నాయి. పందుల ద్వారా మెదడువాపు, కుక్కకాటు వల్ల రేబిస్, గొర్రెలు, మేకల ద్వారా ఆంత్రాక్స్, ఆవులు, గేదెల నుంచి క్షయ, పాల ద్వారా బ్రూసెల్లోసిస్ వ్యాపిస్తోంది. ఇవే కాకుండా పక్షుల వల్ల సిటాకోసిస్, ఎలుకలతో ప్లేగు, పిల్లుల ద్వారా పాగ్సోప్లాస్మోక్రాండై, కోళ్ల ద్వారా బ్లడ్ఫ్లూ, కుందేళ్ల నుంచి టాక్సోప్లాస్మోసిన్, కోతుల ద్వారా లెప్రసీ, ఇతరాత్ర జంతువులు, పక్షుల ద్వారా చర్మ, శ్వాస సంబంధిత వ్యాధులు మనుషులకు వ్యాపిస్తాయి. జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం, వైద్యపరీక్షలు చేయించడం, పరిసరాల శుభ్రత పాటించడం ద్వారా వ్యాధుల సంక్రమణను అడ్డుకోవచ్చు.అయితే ఆ దిశగా వైద్య సేవలు అందించడంలో, ప్రజలను చైతన్య పరచడంలో పాలకులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒకవైపు రేబిస్, మరోవైపు బ్రూసెల్లోసిస్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. వీధి కుక్కలను నియంత్రించడంతో ప్రభుత్వం చేతులెత్తేయడంతో ప్రాణాంతకమైన రేబిస్ వ్యాధి కోరలు చాస్తోంది. వైఎస్సార్సీపీ పాలనలో వీధి కుక్కల నియంత్రణకు పకడ్బందీగా శస్త్రచికిత్సలు ( ప్యామిలీ ప్లానింగ్) నిర్వహించడం జరిగింది. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు తర్వాత శస్త్రచికిత్సలు చేసే ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో కుక్కల సంతతి పెరిగిపోవడంతో వీధుల్లోకి చిన్నారులను పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు పశువులు, గొర్రెలు, మేకల నుంచి బ్రూసెల్లోసిస్ సోకుతోంది. ఉమ్మడి జిల్లాలో ఈ వ్యాధి సోకిన వారు దాదాపు 100 మందికిపైగా ఉన్నారు.
నేడు పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు
లూయిస్పాశ్చర్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా 1885 జూలై 6న పిచ్చికుక్క కాటుకు గురైన బాలుడికి వ్యాధి రాకుండా వ్యాధినిరోధక టీకా మందు విజయవంతంగా ఇచ్చారు. ఆ రోజును ప్రపంచ జూనోసిస్ దినోత్సవంగా పెద్ద ఎత్తున నిర్వహించుకుంటున్నారు. చికిత్స కన్నా– నివారణే మిన్నగా భావించి పశుసంవర్ధకశాఖ నేడు (సోమవారం) కర్నూలులోని బహుళార్ధ పశువైద్యశాలతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ఏరియా వెటర్నరీ హాస్పిటల్స్, వెటర్నరీ డిస్పెన్షరీల్లో పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వ్యాక్సిన్ ఉచితంగా వేసే కార్యక్రమాన్ని చేపట్టింది. ఉమ్మడి కర్నూలు జిల్లాకు 37,810 డోసుల యాంటి రేబిస్ వ్యాక్సిన్ వచ్చింది. ఇందులో కర్నూలు జిల్లాకు 13,060 డోసులు, నంద్యాల జిల్లాకు 24,750 డోసుల వాక్సిన్ సరఫరా అయ్యింది.
ముఖ్యమైన జూనోటిక్ వ్యాధులు
మూగజీవాలతో మనుషులకు అవినాభావ సంబంధం


