మల్లికార్జున సదన్ వద్ద ఉన్న డార్మెంటరీ టెండర్ కాలపరిమితి పూర్తవడంతో ఎవరూ పాల్గొనకుండా బెదిరింపులకు పాల్పడి తమ అనుచరులతో టెండర్ వేయించారు. వారికే టెండర్ దక్కేలా గిమ్మిక్కులు చేశారు. గతంలో మల్లికార్జున సదన్లో దిగే భక్తుల వాహనాల డ్రైవర్లు, ఇతర వ్యక్తులు డార్మెంటరీ ద్వారా వసతి పొందేవారు. అయితే మల్లికార్జున సదన్ వద్ద డార్మెంటరీ టెండర్ దక్కించుకున్న కూటమి నాయకులు అంతటితో ఆగకుండా వసతి విభాగాధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి మల్లికార్జున సదన్లో ఉన్న డార్మెంటరీ మొత్తం క్షేత్రంలో విధులకు వచ్చే పోలీసులకు ఉచితంగా అప్పగించారు. తద్వారా పరోక్షంగా కూటమి నాయకులు దక్కించుకున్న డార్మెంటరీలో వ్యాపారం జరిగేలా అధికారులు లోపాయికారీగా వారికి మేలు జరిగేలా పనిచేసినట్లు తెలుస్తోంది. మల్లికార్జున సదన్ డార్మెంటరీకి వచ్చిన భక్తులు చేసేదేమిలేక ప్రైవేట్ డార్మెంటరీని అశ్రయిస్తున్నారు. అంతటితో ఆగకుండా డార్మెంటరీ వద్ద ఎటువంటి అనుమతులు లేకుండా టీ, కాఫీ, బిస్కెట్లు, టూత్ పేస్టు, బ్రష్లు, షాంపులు, వాటర్బాటిల్స్, కూల్డ్రింక్స్ ఇలా అన్ని సరుకులతో కూడిన ఓ ప్రైవేట్ దుకాణాన్ని సైతం ఏర్పాటు చేశారు.


