నంద్యాల(అర్బన్): ఎల్నినో ప్రభావం జూలై, ఆగస్టు నెలల్లో అధికంగా ఉండే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించుకోవాలని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ సత్యనారాయణ సూచించారు. నంద్యాలలోని వైఎస్సార్ సెంటినరీ హాల్లో శనివారం ఎల్నినోపై అవగాహన–ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డాక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎల్నినోపై రైతులకు శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారులు పూర్తిస్థాయి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి వారం ఆయా ప్రాంతాల వాతావరణ పరిస్థితులను సమీక్షించుకుంటూ తగిన కార్యాచరణను రూపొందించుకోవాలన్నారు. పరిశోధన సంచాలకులు డాక్టర్ సుమతి మాట్లాడుతూ.. తక్కువ వర్షపాత ప్రాంతాలను ముందుగానే గుర్తించి ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికను అమలు చేయాలన్నారు. శాస్త్రవేత్త సుబ్బారావు, తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్, ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ జయలక్ష్మి మాట్లాడుతూ.. సదస్సులో చర్చించిన అంశాలను రైతులకు తప్పక తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు రామచంద్రారావు, తిరుపతి ఆర్ఏఆర్ఎస్ ఏడీఆర్ చంద్రిక, వ్యవసాయ శాఖ తొమ్మిది జిల్లాల అధికారులు, వివిధ పరిశోధన స్థానాల అధిపతులు, కృషి విజ్ఞాన కేంద్రాల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఆదర్శ రైతులు పాల్గొన్నారు.


