● ఉద్యోగాలు వచ్చే వరకూ పోరాడదాం
● వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్
డాక్టర్ దారా సుధీర్
నందికొట్కూరు: సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ప్రతి సారి శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇవ్వడం, ఆ తర్వాత మోసం చేయడం సీఎం చంద్రబాబు నాయుడు నైజమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ దారా సుధీర్ విమర్శించారు. ఉద్యోగాల కోసం రిలే నిరాహార దీక్ష చేస్తున్న శ్రీశైలం ప్రాజెక్టు ముంపు బాధితులకు వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ దారా సంపూర్ణ మద్దతు ప్రకటించారు. దీక్ష శిబిరం నుంచి పటేల్ సెంటర్ వరకూ ముంపు బాధితులు నిర్వహించిన ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అధికారం కోసం చంద్రబాబు ఎన్ని అబద్ధ్దాల హామీలైనా ఇస్తారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి నేతలు ముంపు బాధితుల సమస్యను ఏనాడైనా అసెంబ్లీ, పార్లమెంట్లో కానీ.. కనీసం తెలుగు దేశం మహానాడులోనైనా ఒక్క మాటనైనా మాట్లాడారా.. అని ప్రశ్నించారు. 2029లో జగనన్న సీఎం కావడం ఖాయమని శ్రీశైలం ప్రాజెక్టు నిర్వాసితులకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని స్పష్టం చేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ శ్రీనివాసులుకు వినతి పత్రం అందజేశారు. ఈ ర్యాలీలో వామపక్షాల పార్టీ నాయకులు వెంకటేశ్వర్లు, నరసింహులు, రఘురామమూర్తి, నాగేశ్వరరావు, నీటిముంపు నిరుద్యోగుల సంఘం నాయకులు జయన్న, నాగశేనారెడ్డి, దరగయ్య, కిరణ్గౌడ్, వెంకటేశ్వర్లు, వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.


