ఆదోని అర్బన్: పట్టణ శివారులోని రణమండల కొండ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఏకశిలా ఆంజనేయస్వామి విగ్రహానికి గురువారం 2,001 లీటర్ల పాలతో భక్తులు అభిషేకాన్ని నిర్వహించారు. దాత మణికంఠ నూతనంగా ఆంజనేయస్వామి విగ్రహం ఏర్పాటు చేసినప్పటి నుంచి గురువారం వరకు 41వ రోజులు మండల దీక్ష సందర్భంగా 2,001 లీటర్ల పాలతో అభిషేకం నిర్వహించారు. ఈ మేరకు ప్రతి భక్తునితో స్వామివారికి పాలాభిషేకం జరిపించారు. అంతేగాకుండా పాలాభిషేకం చేసిన వారి ఫొటోను తీసి ఉచితంగా అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ నిర్వాహకుడు టీజీ పాండురంగయ్యశెట్టి, ప్రముఖులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.


