● డబ్బులు తీసుకుని మోసం చేశారు
● టీడీపీ కార్యకర్త వాల్మీకి నరసింహుడు
దేవనకొండ: పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేయలేని టీడీపీ నేతలు ప్రజలకు ఇంకేమి చేస్తారని నల్లచెలిమల గ్రామానికి చెందిన వాల్మీకి నరసింహుడు ప్రశ్నించారు. తాను 35 ఏళ్ల నుంచి టీడీపీలోనే ఉన్నానని, తనను నమ్మించి డబ్బులు వసూలు చేసుకుని నట్టేట ముంచారని ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని సోషల్ మీడియాలో ఒక వీడియో తీసి పోస్టు చేశాడు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నా కుమారుడు డిగ్రీ పూర్తి చేసుకుని ఇంటి దగ్గర ఖాళీగా ఉండడంతో ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాన్ని ఇప్పించాలని మండల కన్వీనర్ను అడిగా. నా వద్ద డబ్బులు తీసుకుని వేరే వాళ్లకు ఆ పోస్టు ఇప్పించారు. దీనిపై అడిగితే ఆలూరు టీడీపీ ఇన్చార్జి వైకుంఠం జ్యోతికి డబ్బులు ఇచ్చామన్నారు. ఆమెనే అడిగితే ఇదిపై నుంచి వచ్చిందని, మేం ఏమీ చేయలేనని చెప్పారు. ఇదే విషయంపై మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడిని అడిగినా ఏమీ స్పందించ లేదు. అప్పు చేసి డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు నేను ఏమి చేయాలి?’ అని అన్నారు. తన కుమారుడికి ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తామని వైకుంఠం జ్యోతి ఇచ్చిన లెటర్ పాడ్ను చూపారు. ఇప్పటికై నా స్పందించి తన డబ్బులు తనకు ఇప్పించాలని కోరారు.


