కర్నూలు(హాస్పిటల్): ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ రాష్ట్ర యాంటీ క్వాకరీ (నకిలీ వైద్యుల నిరోధక) కమిటీని అధికారికంగా ఏర్పాటు చేసింది. ఇందులో సభ్యుడిగా కోడుమూరుకు చెందిన డాక్టర్ శ్రీహరి కురువ నియమితులయ్యారు. ఈ నూతన సబ్ కమిటీ.. చైర్మన్ డాక్టర్ సుబ్బారాయుడు పర్యవేక్షణలో నేరుగా పనిచేస్తుందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో నకిలీ వైద్యానికి వ్యతిరేకంగా బలమైన ఉద్యమం రావాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తు న్న వైద్యవర్గాల్లో ఈ కమిటీ ఏర్పాటు సరికొత్త ఆశలను రేకెత్తించిందని ఆయన అన్నారు. గతంలో ఇలాంటి కమిటీలు కాగితాలకే పరిమితమయ్యాయని, ఈసారి నిబంధనలను అత్యంత కఠినంగా అమలు చేస్తామన్నారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అవలంభిస్తున్న విధానాలను అధ్యయనం చేసి ఇక్కడ కూడా పక్కాగా అమలు చేస్తామన్నారు.


