నంద్యాల: పల్లెలు, పట్టణాల్లోని బాలల రక్షణ కమిటీలు క్రియాశీలకంగా పని చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ వేటకూరి ఏవీఎస్ సూర్యనారాయణ రాజు అన్నారు. పట్టణంలోని ‘వందేమాతరం సమావేశ మందిరం‘లో బాలల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ పథకాల అమలుపై వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాఖల మధ్య సమన్వయం, క్షేత్రస్థాయిలో అధికారుల పనితీరు అధికారులు మెరుగుపరచుకోవాలన్నారు. బాలలపై జరిగే అన్యాయాలు, పోక్సో కేసులు, జేజే యాక్ట్ కేసులకు సంబంధించి పోలీస్, ఐసీడీఎస్, లేబర్, ఎడ్యుకేషన్ శాఖల వద్ద ఉన్న సమాచారంలో వ్యత్యాసాలు ఉండకుండా చూసుకోవాలన్నారు. కేసు నమోదైన 60 రోజుల్లో చార్జ్షీట్ ఫైల్ అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి. ప్రతి 3 నెలలకు ఒకసారి సమీక్షలు నిర్వహించాలన్నారు. జిల్లా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ పై స్థాయిలో జరిగే సైద్ధాంతిక చర్చలకు, క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం ఉంటుందన్నా రు. బాలికకు వివాహం జరగాలంటే కచ్చితంగా 18 ఏళ్లు నిండి ఉండాలనే నిబంధనను కఠినంగా అమలు చేస్తోందన్నా రు. సమావేశంలో కమిషన్ సభ్యులు చల్లా మధుసూదన్, జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్, ఐసీడీఎస్, పోలీస్, లేబర్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు పింఛన్ల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): జూలై నెల పింఛన్ల పంపిణీ బుధవారం చేపట్టనున్నా రు. ఇందుకోసం రూ.194.43 కోట్లు విడుదలయ్యాయి. వార్డు, గ్రామ సచివాలయ సెక్రటరీలు, వెల్ఫేర్ అసిస్టెంట్లు నేడు ఇంటింటికి వెళ్లి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఉమ్మడి జిల్లాలో జూలై నెలలో పింఛన్లు 4,44,853 ఉన్నాయి.


