సర్ ప్రక్రియపై ఓటర్లలో ఆందోళన నెలకొంది. అధికారులు టీడీపీ కార్యాలయాలు, సచివాలయాలు, దేవాలయ ఆవరణాలకు వెళ్లి మ్యాపింగ్ చేస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జూన్ 15న ప్రారంభమైన ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో ఏం జరుగుతుందోననే ఆందోళ న అటు రాజకీయ వర్గాల్లో, ఇటు ఓటర్లలో మొ దలైంది. ప్రక్రియ మొదలైన నాటి నుంచి బీఎల్ఓలు రాజకీయ పార్టీ నాయకులతో సంబంధం లేకుండా ఇంటింటికి వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేయాలి. ఆ తర్వాత ఓటరు ఉన్నాడా.. లేదా అని విచారించాలి. అనంతరం మ్యాపింగ్ చేయాల్సి ఉంది. అయితే బీఎల్ఓలు 2002 ఓటర్ల జాబితా, ప్రస్తుత జాబితాను పట్టుకొని ఇంటిపేర్లతో సరిపోయినవి, వారికి బంధుత్వం ఉన్నవి, టీడీపీ బీఎల్ఏలు చెప్పినవి మ్యాపింగ్ చేసేస్తున్నట్లు స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న అనేక మంది ఓట్లు లేవనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


