● నేడు పల్స్పోలియో కార్యక్రమం
● జిల్లాలో 2.38 లక్షల మంది
చిన్నారుల గుర్తింపు
గోస్పాడు: చిన్నారులకు రెండే రెండు చుక్కలు పోలియో బారిన పడకుండా చేస్తాయి. నిండు నూరేళ్లూ ఆరోగ్యంగా ఉండేలా చూస్తాయి. తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధతో తమ పిల్లలకు ఆదివారం పోలియో చుక్కలు వేయించాలని వైద్యులు సూచిస్తున్నారు. సాధారణంగా పిల్లలకు పుట్టిన వెంటనే ఓరల్ పోలియో వ్యాక్సిన్ను (ఓపీవీ) జీరో డోస్ ఇస్తారు. చిన్నారులకు అంగ వైకల్యం రాకుండా ఉండేందుకు దీన్ని వేస్తారు. అలాగే పిల్లలు పుట్టిన 24 గంటల లోపు హెపటైటిస్–బి జీరో డోస్, బీసీజీ, ఆ తర్వాత ఆరు, పది, 14 వారాలకు, ఆ తర్వాత వివిధ రకాల వ్యాక్సిన్లు వేస్తారు. ఇవన్నీ వారికి ప్రమాదకరమైన జబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయి. అలాగే ఐదేళ్లలోపు పిల్లలకు పోలియో చుక్కలు వేయించాలి.
జిల్లాలో 2.38 లక్షల మంది
చిన్నారుల గుర్తింపు
జిల్లాలో ఐదేళ్ల లోపు ఉన్న 2,38,404 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా అధికారులు గుర్తించారు. ఇందుకోసం 1,313 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశారు. పల్స్ పోలియోను పకడ్బందీగా నిర్వహించేందుకు 2,626 టీములను ఏర్పాటు చేశారు. 67 మొబైల్ టీమ్లు, 5,252 మంది సిబ్బంది పనిచేయనున్నారు. అధిక సంఖ్యలో ప్రజలు ఉండే ప్రదేశాలైన బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు తదితర చోట్లకు 46 టీమ్లు వెళ్లి, అక్కడ ఉంటే చిన్నారులకు వాక్సిన్ వేస్తాయి. 26 హైరిస్కు ప్రాంతాలను గుర్తించారు. ఆదివారం వ్యాక్సినేషన్తో పాటు సోమ, మంగళ వారాల్లో మాపింగ్ ప్రోగ్రామ్లో భాగంగా హైరిస్క్ ప్రాంతాలను మొబైల్ టీమ్లో కవర్ చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఈ పల్స్ పోలియో కార్యక్రమంలో 51 పీహెచ్సీలు, 16 యూపీహెచ్సీల పరిధిలో నిర్వహంచనున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, ఏఎన్ఎంలు, మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు పాల్గొంటున్నారు.


