పెరిగిన కోడిగుడ్ల ధరలు | - | Sakshi
Sakshi News home page

పెరిగిన కోడిగుడ్ల ధరలు

Jun 27 2026 1:55 AM | Updated on Jun 27 2026 1:55 AM

గోస్పాడు: కోడిగుడ్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఒక్కో గుడ్డు ధర రూ.8 నుంచి రూ.9 వరకు పలుకుతోంది. దీంతో సామాన్యులు కొనుగోలు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధరలు ఒకలా, మారు మూల గ్రామాల్లో మరోకంగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలల నుంచి గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. జనవరి దాటాక నెలరోజుల పాటు 30 గుడ్ల ధరలు రూ. 120 నుంచి రూ. 130 వరకు ఉన్నాయి. నిలకడ లేకుండా ప్రతిరోజూ ఒక్కో గుడ్డు ధర 5 పైసల నుంచి 15 పైసల వరకు పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం వందగుడ్ల ధర రూ. 675 నుంచి రూ.685 వరకు ఉంది. హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి కోళ్లను, గుడ్లను దిగుమతులు చేసుకోవాల్సి వస్తుండటంతో ధర పెరుగుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పట్టణాల్లో వ్యాపారులు ఒక్కొక్కటి రూ.8 వరకు విక్రయిస్తుండగా మారుమూల ప్రాంతాల్లో ఒక్కొక్క గుడ్డు ధర రూ.9 వరకు ఉంది. పెరిగిన ధరతో హోటళ్ల నిర్వాహకులు, బేకరీల యజమానులు ఆందోళన చెందుతున్నారు.

అక్షరాలు నేర్పిన టీచరమ్మకు అ‘పూర్వ’ సన్మానం

మహానంది: అక్షరాలు నేర్పి తమను ఉన్నతులు గా తీర్చిదిద్దిన టీచరమ్మకు పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. టీచరమ్మ 75వ పుట్టినరోజు వేడుకలను వైభవంగా నిర్వహించారు. మహానంది మండలం ఎంసీ ఫారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 1979 నుంచి 1984 వరకు ఉపాధ్యాయురాలు దండు హేమలతమ్మ పనిచేశారు. ఆ సమయంలో ఆమె ఇంటింటికి తిరిగి తల్లిదండ్రులతో మాట్లాడి వారి పిల్లలను పాఠశాలలో చేర్పించి చదువులు చెప్పారు. ఆమె వద్ద చదువులు నేర్చుకున్నవారిలో జడ్జీలు, ఉపాధ్యాయులు, బ్యాంకు మేనేజర్లు, పశుపరిశోధనా స్థానాల్లో వివిధ హోదాల్లో ఉన్నారు. హేమలతమ్మ 75వ పుట్టినరోజు సందర్భంగా నల్లమలలోని పచ్చర్ల వద్ద ఉన్న జంగిల్‌ క్యాంపులో కలిసి వేడుకలు వైభవంగా చేశారు. రాజంపేట జిల్లా జడ్జి ప్రవీణ్‌కుమార్‌, సీనియర్‌ సివిల్‌ జడ్జి ప్రత్యూష, వ్యవసాయ కళాశాల ఏఈఓ డక్కా స్వామిదాసు, పశుపరిశోధనా స్థానం లైవ్‌స్టాక్‌ సిబ్బంది డక్కా ఎర్రన్న, కోటక్‌ బ్యాంకులో పనిచేస్తున్న డక్కా మాచర్ల, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌నాయక్‌, పొదిలి శ్రీనివాస్‌, న్యాయవాది డక్కా శరత్‌కుమార్‌, శ్యాంసన్‌, తదితరులు పాల్గొన్నారు.

ట్రిపుల్‌ఐటీడీఎంలో

సర్టిఫికెట్‌ ప్రోగ్రాం కోర్సులు

కర్నూలు సిటీ: ట్రిపుల్‌ఐటీడీఎంలో ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, డ్రోన్‌ టెక్నాలజీపై ఏఐసీటీఈ–క్యూపీ–పీజీ సర్టిఫికెట్‌ ప్రోగ్రాంకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కో–ఆర్డినేటర్‌ నరేష్‌ బాబు తెలిపారు. ఇంజనీరింగ్‌ కాలేజీల్లో సీఎస్‌ఈ ఫ్యాకల్టీ బోధన నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశించిన ప్రోగ్రాంకు వచ్చే నెల 5లోపు దర ఖాస్తు చేసుకోవచ్చన్నారు. మొత్తం 200 గంటల వ్యవధితో హైబ్రిడ్‌ విధానంలో(ఆన్‌లైన్‌, ప్రత్యక్ష తరగతులు) నిర్వహిస్తామన్నారు. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లో 50 మంది, డ్రోన్‌ టెక్నాలజీపై 50 మంది అధ్యాపకులకు శిక్షణనిస్తామన్నారు. ప్రత్యక్ష తరగతులకు ఉచిత వసతి కల్పిస్తామన్నారు. ఏఐసీటీఈ క్యూఐపీ పోర్టల్‌ https://qippg.aicte.gov.in/ లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

ఏఎస్పీ అడ్మిన్‌గా ఖాదర్‌బాషా

బొమ్మలసత్రం: నంద్యాల జిల్లా అడిషనల్‌ ఎస్పీ అడ్మిన్‌గా ఖాదర్‌బాషా శుక్రవారం పదవీ భాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం విధులు కొనసాగిస్తున్న అడిషనల్‌ ఎస్పీ యుగంధర్‌బాబును కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ సాధారణ బదిలీల్లో భాగంగా ఖాదర్‌ బాషాను నంద్యాలకు బదిలీ చేశారు. ఈయన స్వస్థలం అనంతపురం జిల్లా కాగా.. 2012లో డీఎస్పీగా పదవీ భాధ్యతలు స్వీకరించి డోన్‌, రంపచోడవరం, చిత్తూరు, విజయవాడ పట్ట ణాల్లో డీఎస్పీగా పనిచేశారు. అనంతంతం అడిషనల్‌ ఎస్పీగా పదోన్నతి పొంది కోనసీమ జిల్లా, ఇంటలిజెన్స్‌ విభాగాల్లో విధులు నిర్వసి స్తూ నంద్యాల జిల్లాకు బదిలీపై వచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement