● బనగానపల్లెలో షియాల ప్రదర్శన
బనగానపల్లె: మతసామరస్యానికి ప్రతీకగా జరుపుకునే మొహర్రంను శుక్రవారం బనగానపల్లెలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ తరువాత ఏపీలో ఆ స్థాయిలో ఇక్కడ మాతం నిర్వహించడం ప్రత్యేకత. ఊరేగింపులో బనగానపల్లె నవాబు వంశీయులు మీర్ఫజలే అలిఖాన్, ఆయన కుమారుడు గూలంఅలిఖాన్తో పాటు ఎక్కువ సంఖ్యలో షియా మతస్తులు పాల్గొన్నారు.నల్లటి వస్త్రాలు ధరించి భారీ సంఖ్యలో పాల్గొన్నారు. వీరంతా శోకగీతాలు అలపిస్తూ బ్లేడ్లు, చురకత్తులతో ఎదలు, వీపు పైనా మాతం నిర్వహిస్తూ భక్తిని చాటుకున్నారు. కొండపేటలోని ఇమాంఖాసీం పీరు జుర్రేరువాగు వద్దకు చేరుకున్న అన్ని పీర్లను అలింగనం చేసుకుంది. పీర్లన్నింటినీ పట్టణంలోని జుర్రేరు వాగులో శుద్ధి చేసి అనంతరం వాటిని తీరిగి చావిళ్లకు తీసుకెళ్లారు. పలువురు దాతలు రస్నా, పానీయాలు, మంచి నీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఉరేగింపునకు బనగానపల్లె పరిసర గ్రామాల నుంచి వేలాది మంది హిందూ, ముస్లింలు వచ్చి మాతం పీర్ల నిమజ్జనాన్ని చూశారు. మండలంలోని అన్ని గ్రామాల్లోనూ మొహర్రం పదో రోజును భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. రాత్రి సంతాప సూచకంగా వ్యాపార దుకాణాలు, సినిమా హాల్స్ మూసివేయగా, వీధిలైట్లను ఆర్పివేశారు. బనగానపల్లె పట్టణ సీఐ ప్రవీణ్కుమార్, రూరల్ సీఐ మంజునాథ్రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.


