● రాజకీయ కక్షతో వైఎస్సార్సీపీ నాయకుడికి వేధింపులు
ఆళ్లగడ్డ: టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. వైఎస్సార్సీపీ నాయకులను వేధించడమే పనిగా వారు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. వైఎస్సార్సీపీ నాయకుడిపై కక్షతో ఏకంగా పంటకాల్వకు అడ్డుకట్ట వేసి పైశాచిక ఆనందం పొందుతున్నారు. తన పొలంలోని నీరు కాల్వ ద్వారా వెళ్లకుండా టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారని రామచంద్రాపురం మాజీ సర్పంచ్, వైఎస్సార్సీపీ నాయకుడు చౌడయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 70 ఏళ్లుగా ఉన్న పంటకాల్వ ద్వారానే నీరు వెళ్తుందని ఇప్పుడు ‘అది ప్రభుత్వ కాల్వ కాదని మా సొంత పొలాల ద్వారా వెళ్తుంది’ అని అడ్డుకట్ట వేయడం ఏంటని ప్రశ్నించారు. అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. కాల్వ పూడ్చడంతో ఎస్సీ కాలనీలోని మురుగునీరంతా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది కూడా కాల్వను పూడ్చడంతో తన ఐదు ఎకరాల పొలంలో వర్షపు నీరు నిల్వ ఉండి సాగుచేసిన జొన్న పంట దెబ్బతినిందన్నారు. అధికారులు చర్యలు తీసుకొని సమస్యను పరిష్కరించాలని కోరారు.


