నంద్యాల(న్యూటౌన్): జిల్లాలో స్టెప్ అప్ సౌకర్యం పొందిన వ్యాయామ ఉపాధ్యాయుల వేతనాలను యథావిధిగా చెల్లించాలని జిల్లా ఫ్యాప్టో చైర్మన్ రామచంద్రారెడ్డి, సెక్రటరీ జనరల్ షేక్ దస్తగిరి బాషా, డిప్యూటీ సెక్రటరీ జనరల్ పీవీ ప్రసాద్, నగిరి శ్రీనివాసులు, కో చైర్మన్ స్వామి శేఖర్ జిల్లా ఖజానా శాఖ అధికారులను డిమాండ్ చేశారు. గురువారం జిల్లా ఖజానా కార్యాలయంలో అసిస్టెంట్ జిల్లా ట్రెజరీ, అకౌంట్స్ అధికారి శ్రీనివాసులుకు కలిసి వ్యాయామ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రం అందజేశారు. జిల్లాలోని పాఠశాల సహాయకులు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు ఒకే డీఎస్సీ ద్వారా పీఈటీలుగా ఎన్నికై విడతలవారీగా పాఠశాల సహాయకులుగా పదోన్నతి పొందారన్నారు. సీనియర్ ఉపాధ్యాయులు ఎఫ్ఆర్ 22 (బి) ప్రకారం జూనియర్ ఉపాధ్యాయులు వేతనంతో సమానంగా తమ వేతనాలను స్థిరీకరించుకున్నారని అయితే కొన్ని కారణాలతో సీనియర్ ఉపాధ్యాయుల స్టెప్ అప్ సౌకర్యాన్ని స్టెప్ డౌన్ చేస్తూ గత నెలలో జిల్లా ఖజానా అధికారి ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. రాష్ట్ర అధికారుల నుండి వివరణ వచ్చేవరకు నంద్యాల జిల్లా ఖజానా అధికారి స్టెప్ డౌన్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను తాత్కాలికంగా నిలుపుదల చేయాలన్నారు. జూన్ నెల జీతాలను యథావిధిగా చెల్లించుటకు సబ్ ట్రెజరీ అధికారులకు తగు సూచనలు ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో జిల్లా కార్యవర్గ సభ్యులు శివకుమార్, రవి, ప్రసాద్, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.


