డోన్ టౌన్: 44వ నంబరు జాతీయ రహదారి నియోజకవర్గంలో దాదాపు 50 కిలో మీటర్ల మేర ఉంది. డోన్ మండలంలోని జగదుర్తి గ్రామం నుంచి ప్యాపిలి మండలం పోతుదొడ్డి గ్రామం వరకు ఉన్న జాతీయ రహదారిలో గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం కిలో మీటరుకు వంద గుంతలు ఏర్పడగా ప్యాచ్లు వేసి మమా.. అనిపించారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభం కావడంతో ప్యాచ్లు ఛిద్రమై వాహనదారులను భయపెడుతున్నాయి. ఇటీవల జిల్లా కలెక్టర్, ఎస్పీ, రవాణ శాఖ, కలెక్టర్ అధికారులు ఈ రహదారిపై బ్లాక్ స్పాట్లను గుర్తించారే కానీ చర్యలు తీసుకోలేదు. కార్లు, ఆటోలు, జీపులు, వ్యాన్లు, బైక్లు గుంతల్లో పడి మరమ్మతులకు గురవుతున్నట్లు వాహన యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


