● పోలీసుల సమక్షంలో యువకుడికి బెదిరింపులు
● యువతిని కుటుంబ సభ్యులతో పంపిన నేతలు
సాక్షిటాస్క్ఫోర్స్: ఓ ప్రేమ జంటను టీడీపీ నాయకులు విడదీశారు. ఈ ఘటన డోన్ అర్బన్ పోలీసు స్టేషన్లో సాక్షాత్తు పోలీసుల ఎదుట జరగటం చర్చానీయాంశం అయ్యింది. డోన్ పట్టణానికి చెందిన మమాబూబ్ బాషా అనే యువకుడు ప్యాపిలి మండలంలోని గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి వారం రోజుల క్రితం తిరుపతి వెళ్లి పెళ్లి చేసుకున్నారు. పోలీసుల ఒత్తిడితో డోన్కు వచ్చిన ఆ ప్రేమ జంటను స్టేషన్లో ఒక పోలీసు అధికారి కౌన్సెలింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా అక్కడికి గార్లదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు చేరుకున్నారు. పోలీసు అధికారి పట్ల అమర్యాదగా ప్రవర్తించడమే కాక అమ్మాయిని తమ వెంట పంపాలని అధికార జులుం ప్రదర్శించారు. ఇందుకు అధికారి నిరాకరించడంతో టీడీపీ నాయకులు తీవ్ర పదజాలంతో దూషించారు. సమస్య తీవ్రరూపం దాల్చకుండా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మేజర్ అయిన యువతిని టీడీపీ నాయకునితో కలిసి వచ్చిన బంధువులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు. ఈ తతంగం అంతా చూసి యువకుడి బంధువులు తీవ్ర భయాందోళనకు గురయ్యా రు. ప్రస్తుతం యువకుడు పోలీసుల అదుపులో ఉండగా యుతిని మాత్రం అధికార పార్టీ నాయకులు తమ వెంట తీసుకెళ్లారు. మేజర్లు అయిన ఒక ప్రేమ జంటకు భద్రత కల్పించాల్సిన పోలీసు అధికారులే మౌనం దాల్చడంపై ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా అర్బన్ సీఐ ఇంతియాజ్బాషాని ఈ విషయంపై వివరణ అడుగగా.. కౌన్సెలింగ్ అనంతరం అమ్మాయి అభీష్టం మేరకు వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు.


