అధిక రేట్లు.. అనర్హులతో పనులు!
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల పనుల్లో అవకతవకలు
ప్రధాని శ్రీశైలం పర్యటన ఏర్పాట్లలోనూ ఇంజినీర్ల ఇష్టారాజ్యం
సీఎం పేషీ, విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు
శ్రీశైలంటెంపుల్: ప్రధాని నరేంద్ర మోదీ శ్రీశైలం పర్యటన సందర్భంగా అధిక రేట్లకు, అర్హతలేని కాంట్రాక్టర్లకు పనులు అప్పగించినట్లు, భారీగా అవకతవకలు జరిగినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి, విజిలెన్స్ శాఖకు, దేవదాయశాఖ ముఖ్య అధికారులకు శ్రీశైలానికి చెందిన ఓ వ్యక్తి ఫిర్యాదు చేశారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవ పనుల్లో సైతం భారీ అవకతవకలు జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో పేర్కొన్న అంశాలు ఇవీ..
● ప్రధాని నరేంద్రమోదీ గత సంవత్సరం అక్టోబరు 16న శ్రీశైలంలో పర్యటించారు. శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు.
● ఈ–ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లు పిలిచామని చెబుతున్న దేవస్థానం జీవో.ఎంఎస్ నెం.94 ప్రకారం కాకుండా తప్పుగా ఎలిజిలిటీ క్రైటీరియా చేసి అర్హత లేని వారికి క్లాస్–4 బదులుగా క్లాస్–5తో రెకమెండేషన్ చేశారు.
● సప్లై మెటీరియల్ టెండర్లకు ఎంఎస్ఎంఈ, ఫర్మ్ రిజిస్ట్రేషన్ లేకుండా చేశారు.
● దేవస్థాన ఇంజినీర్ల తమ బినామీ కాంట్రాక్టర్లకు మాత్రమే కాంట్రాక్టులు దక్కేలా టెండర్లు తయారు చేశారనే విమర్శలు ఉన్నాయి.
● ప్రధాని మోదీ శ్రీశైలం పర్యటన నేపథ్యంలో భ్రమరాంబా అతిథిగృహంలో ఫర్నిచర్ నిమిత్తం రూ.1.5కోట్లు వృధా చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
● మార్కెట్ రేట్ల కంటే నాలుగు నుంచి ఐదు రేట్లకు ఫర్నిచర్ కొనుగోలు చేశారని, భ్రమరాంబా అతిథిగృహంలో పాత ఫర్నిచర్ ఎక్కడికి తీసుకెళ్లాలో చెప్పలేదని ఫిర్యాదు చేశారు.
● దేవస్థానంలోని పలు ప్రదేశాల్లో పెయింటింగ్, చిత్రాల పెయింటింగ్ వేయడానికి అయిదు రెట్లు అధికంగా డబ్బులు ఇచ్చి స్వామివారి నిధులకు గండి కొట్టే ప్రయత్నం చేశారు.
● బారీకేడింగ్, పెండాల్స్ కొనుగోలు చేశారో, అద్దెకు తీసుకొచ్చారో అర్థం కానీ పరిస్థితి నెలకొంది. బారికేడ్లు ఒక ఫ్రేమ్ రూ.300కాగా దేవస్థానం తీసుకున్న కోటేషన్ రేటు రూ.2వేలు, అపై జీఎస్టీతో టెండర్లు పిలిచారని ఫిర్యాదులో పేర్కొన్నార.
● దేవస్థానం శానిటేషన్ విభాగం రూ.80లక్షలతో బిల్లులు చెల్లించేలా సిద్ధం చేశారు.
● ప్రధానికి స్వాగతం పలికేందుకు సంప్రదాయ వస్త్రధారణ పేరుతో మహిళలకు కాషాయం చీర, జాకెట్, స్కార్ప్, పురుషులకు తెల్లచొక్కా, పంచె పేరుతో నాసిరకం వస్తువులను తీసుకువచ్చి, అది కూడా తక్కువ తీసుకువచ్చి ఎక్కువ మందికి ఇచ్చినట్లు బిల్లులు సిద్ధం చేశారు.
● తోటలు, గార్డెన్లు, ఇతర మొక్కలు ఏర్పాటు చేసినందుకు రూ.లక్షల్లో బిల్లులు చెల్లించేందుకు బిల్లులు సిద్ధం చేశారు.
● పై విషయాలపై క్షుణ్ణంగా పరిశీలించి, పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అధిక రేట్లు.. అనర్హులతో పనులు!


