ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభం
నంద్యాల (న్యూటౌన్): ఇంటర్మీడియెట్ ప్రాక్టికల్ పరీక్షలు జిల్లాలోని 73 కేంద్రాల్లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించారు. ఉదయం జరిగిన పరీక్షకు 2,237 మంది విద్యార్థులకు గాను 2,133 మంది హాజరు కాగా 104 మంది గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 1,717 మందికి గాను 1688 మంది హాజరు కాగా.. 29 మంది గైర్హాజరయ్యారు. పబ్లిక్ ప్రాక్టికల్స్ పరీక్షలను అన్ని పరీక్ష కేంద్రాల్లో సజావుగా నిర్వహించినట్లు డీఐఈఓ శంకర్నాయక్ తెలిపారు. సీసీ కెమెరా నిఘాలో పడక్బందీగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
వైభవంగా శ్రీశైలగిరి ప్రదక్షిణ
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల క్షేత్రంలో పౌర్ణమిని పురస్కరించుకుని ఆదివారం సాయంత్రం శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామిఅమ్మవార్ల మహా మంగళహారతుల అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకీలో ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. పల్లకీ ఊరేగింపుతో శ్రీశైల గిరి ప్రదక్షిణ ప్రారంభమైంది. ఆలయ మహాద్వారం నుంచి మొదలైన ఈ ప్రదక్షిణ గంగాధర మండపం, అంకాళమ్మ గుడి, నందిమండపం, గంగాసదనం, బయలు వీరభద్రస్వామి ఆలయం, రింగ్రోడ్డు, ఫిల్టర్బెడ్, సిద్ధరామప్ప కొలను, పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడి నుంచి తిరిగి నందిమండపం, ఆలయ మహాద్వారం వద్దకు చేరుకుంది. అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమంలో శ్రీశైల దేవస్థాన అధికారులు, సిబ్బంది, పలువురు భక్తులు పాల్గొన్నారు.
నేడు ‘డయల్ యువర్
సీఎండీ, ఎస్ఈ’
కర్నూలు(అగ్రికల్చర్): ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయమైన తిరుపతి నుంచి డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమం ఈ నెల 2వ తేదీ ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతుందని కర్నూలు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆర్.ప్రదీప్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు 89777 16661 నంబరుకు ఫోన్ చేయవచ్చని పేర్కొన్నారు. కర్నూలు కొత్తబస్టాండు సమీపంలో ఉన్న విద్యుత్ భవన్లో కూడ సోమవారం డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. వినియోగదారులు నంబరుకు 73826 14308 పోన్చేసి సమస్యలను తెలియచేస్తే వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.


