రాజకీయ హడావిడి !
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : మున్సిపల్ ఎన్నికల వేడి మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా ఎన్నికల అధికారి బుధవారం మున్సిపల్ ఎన్నికల నోటిపికేషన్ విడుదల చేశారు. వెంటనే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. షెడ్యూల్ వచ్చిన మరుసటి రోజే నోటిఫికేషన్ రావడంతో జిల్లాలో ఒక్కసారిగా రాజకీయ హడావుడి పెరిగింది. అభ్యర్థులను ఎంపిక చేయడంతో నేతలు తలమునకలయ్యారు. పోటీ చేసే అభ్యర్థులు ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన కౌంటర్ల వద్దకు వచ్చి నామినేషన్ పత్రాలను తీసుకుంటున్నారు. పలు చోట్ల నామినేషన్ దాఖలు కేంద్రాలను కలెక్టర్ చంద్రశేఖర్ పరిశీలించారు.
అచితూచి అభ్యర్థుల ఖరారు
షెడ్యూల్ వచ్చిన తర్వాతి రోజే నోటిపికేషన్ రావడంతో అభ్యర్థులు, రాజకీయ పార్టీలకు సమయం లేకుండా పోయింది. ఇప్పటికే ఆయా పార్టీలు ఏఏ డివిజన్లు, వార్డుల్లో ఎవర్ని నిలబెట్టలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చాయి. అయితే.. కొన్ని డివిజన్లు, వార్డుల్లో పోటీ ఎక్కువగా ఉండటంతో అభ్యర్థుల ప్రకటన విషయంలో అచితూచి వ్యవహరిస్తున్నాయి. నామినేషన్లకు ఇక, రెండు రోజులే సమయం ఉండడంతో అన్ని పార్టీలు అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నాయి. అన్ని విధాలా సర్వే నిర్వహించి గెలిచే అవకాశం ఉన్న అభ్యర్థులకే టికెట్లు ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పోటీ చేస్తామని, టికెట్లు ఖరారైన అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు కావాల్సిన పత్రాలు సమకూర్చుకుంటున్నారు. ఇంటి, నల్లా బిల్లులు చెల్లించి నోడ్యూ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారు. కొందరు బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు.
నల్లగొండలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రకటన..
నల్లగొండ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ బుధవారం రాత్రి 45 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. బీఆర్ఎస్ పార్టీ 18 మంది కార్పొరేట్ అభ్యర్థులను బుధవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ నరేందర్రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి 18 మంది జాబితాను విడుదల చేశారు. మిగతా వారిని గురువారం ప్రకటించే అవకాశం ఉంది. బీజేపీ కూడా గురువారం అభ్యర్థులను ప్రకటిస్తుందని తెలిసింది.
భువనగిరిలో..
భువనగిరి మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థులను ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి బుధవారం ప్రకటించారు. మొత్తం 14 మంది కౌన్సిలర్ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఆలేరు మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్లు 12 వార్డులకు అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ ఆరుగురు అభ్యర్థులను ఖరారు చేసింది.
అన్నీ సిద్ధం చేసుకుంటున్న అభ్యర్థులు
నామినేషన్లకు మూడు రోజులు గడువు ఇవ్వగా ఇప్పటికే బుధవారం ఒక రోజు పూర్తయింది. ఇంకా రెండు రోజులే సమయం ఉంది. ఈ రెండు రోజుల్లో పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. నామినేషన్ వేసినా.. ఏ, బీ ఫారాలు ఇవ్వడానికి ఉపసంహరణ వరకు గడువు ఉండడంతో ముందుగా నామినేషన్ వేసేందుకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.
ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీల్లో నామినేషన్ల ప్రక్రియ బుధవారం ప్రారంభమైంది. ఉమ్మడి జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో తొలిరోజు 93 నామినేషన్లు దాఖలయ్యాయి. నల్లగొండ కార్పొరేషన్లో మొదటి రోజు 11 నామినేషన్లు రాగా, మిర్యాలగూడలో 4, దేవరకొండలో 10, నందికొండలో 6, చిట్యాలలో 9, చండూరులో 4 నామినేషన్లు దాఖలయ్యాయి. సూర్యాపేటలో 13, తిరుమలగిరిలో 9, మోత్కూర్లో 3, కోదాడలో 1, భువనగిరిలో 15, చౌటుప్పల్లో 6, పోచంపల్లిలో 2 నామినేషన్లు వచ్చాయి.
మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల
ఫ అభ్యర్థుల ఎంపికలో నాయకుల
తలమునకలు
ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
తొలిరోజు 93 నామినేషన్లు దాఖలు
ఫ నామినేషన్లకు రెండు రోజులే గడువు


