లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
వలిగొండ : లారీ బైక్ను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన వలిగొండ మండలం నర్సాపురం గ్రామం పరిధిలోని బోడబండగూడెం వద్ద ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోత్కూర్ మండలంలోని దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికిరణ్ (19), దాచారం గ్రామానికి చెందిన బోల్ల దీక్షిత్ (21) స్నేహితులు. ఇద్దరు కలిసి బైక్పై భువనగిరికి వెళ్తుండగా నర్సాపురం గ్రామంలోని బోడబండగూడెం వద్ద ప్రమాదవశాత్తు లారీ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు లారీ టైర్ల కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని పంచనామా నిర్వహించి మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం రామన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై యుగేందర్ తెలిపారు.
దాచారం, దత్తప్పగూడెంలో
విషాదఛాయలు
మోత్కూరు : నర్సాపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన యువకుల స్వగ్రామాలైన మోత్కూరు మండలం దాచారం, దత్తప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వీరు ఇరు కుటుంబాల్లో ఏకై క కుమారులు కావడంతో ఆర్తనాదాలు మిన్నంటాయి.
నాడు పిడుగుపాటుతో తండ్రి..
నేడు రోడ్డు ప్రమాదంలో కుమారుడు..
దాచారం గ్రామానికి చెందిన బోళ్ల సంపత్– విజయ దంపతులకు కుమారుడు దీక్షిత్ (21), కుమార్తె జస్విక ఉన్నారు. నాలుగు సంవత్సరాల క్రితం స్వగ్రామంలో చింత చెట్టు కింద ఉన్న సంపత్ పిడుగుపాటుతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో తల్లి ప్రభుత్వ పాఠశాలలో కాంట్రాక్ట్ కింద నైట్ వాచ్మెన్గా పని చేస్తూ పిల్లలను పోషిస్తోంది. దీక్షిత్ హైదరాబాద్లోని ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. నాడు భర్త సంపత్ పిడుగుపాటుకు గురై మృతి చెందడంతో ఆ బాధ నుంచి తేరుకోక ముందే ఇప్పుడు కుమారుడు దీక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.
ఏకై క కుమారుడిని కోల్పోవడంతో..
దత్తప్పగూడెం గ్రామానికి చెందిన కుక్కల సాయికిరణ్–పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిది నిరుపేద వ్యవసాయ కుటుంబం. కుమారుడు సాయికిరణ్ డిగ్రీ వరకు చదివాడు. కొంత కాలం ప్రైవేట్ కంపెనీలో పని చేసి మానేశాడు. కుటుంబానికి అండగా నిలబడతాడనుకున్న కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో తల్లిదండ్రులు, అతడి అక్కాచెల్లెళ్లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇరు కుటుంబాల్లో ఒక్కగానొక్క కుమారులు చనిపోవడంతో వారి తల్లిదండ్రుల రోదనలు ప్రజలను కలిచివేశాయి.
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి
లారీ ఢీకొని ఇద్దరు యువకులు మృతి


