కందనూలు: జైల్లు శిక్ష అనుభవిస్తూ.. ఆర్థిక స్థోమత లేని వారికి ఉచితంగా న్యాయ సహాయం అందిస్తామని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి నిహారిక అన్నారు. మంగళవారం ఆమె జిల్లాకేంద్రంలోని సబ్ జైలును సందర్శించి ఖైదీలతో మాట్లాడుతూ వారికి కల్పిస్తున్న వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. వంటశాల, ఆహార పదార్థాలను పరిశీలించి.. ఖైదీలకు మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా లేదా అని నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎవరైనా న్యాయవాదిని పెట్టుకునే స్థోమత లేని వారికి తమ సంస్థ నుంచి ప్రభుత్వ న్యాయవాదిని ఉచితంగా నియమిస్తామని చెప్పారు. కార్యక్రమంలో శ్రీరామ్ ఆర్య, పవన శేషసాయి, భవానిబాయి, జైలు సిబ్బంది పాల్గొన్నారు.
నేత్రదానంపై అవగాహన
కందనూలు: నేత్రదానంపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని డీఎంహెచ్ఓ కృష్ణ అన్నారు. మంగళవారం జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 41వ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నేత్రదాన ఆవశ్యకతపై వ్యాసరచన పోటీలు నిర్వహించి.. గెలుపొందిన విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ఎవరైనా ఒక రు మరణించిన తర్వాత నేత్రదానం చేయడం వల్ల ఇద్దరికీ చూపు వస్తుందని, కావునా వ్యక్తి మరణించిన తర్వాత వారి కుటుంబ సభ్యులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి నేత్రదానం చేయాలని కోరారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు కళ్ల అద్దాలు అందజేశారు.
నియోజకవర్గ
సమగ్ర అభివృద్ధే లక్ష్యం
కల్వకుర్తి రూరల్: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. మంగళవారం కల్వకుర్తిలో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టారు. దాదాపు రూ.కోటితో ఎల్లికల్ రోడ్డులో నిర్మించిన వంతెనను ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి చెక్కులు, స్మార్ట్ రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్లు, వీధి వ్యాపారులకు ప్రొసీడింగ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన ప్రతిఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తింపజేస్తామన్నారు. అనంతరం హైమాక్స్ లైట్లను ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ రత్నమాల, రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు బాలాజీసింగ్, జిల్లెల్ల రాములు, మున్సిపల్ వైస్ చైర్మన్ షానావాజ్ఖాన్, తహసీల్దార్ ఇబ్రహీం, కమిషనర్ మహమ్ముద్షేక్, శ్రీకాంత్రెడ్డి, రమాకాంత్రెడ్డి, రాహుల్, బాల్రెడ్డి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.


